Breaking News

రైతుల ఆందోళనపై చర్చకు విపక్షాలు పట్టు.. కేంద్రం సంచలన నిర్ణయం


కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నల్లచట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు వెన్నువెరని పోరాటం చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకండా కర్షకులు చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరినీ కదలిస్తోంది. తాజాగా, ఈ అంశంపై చర్చించాలని పార్లమెంట్ నిర్ణయించింది. రైతుల నిరసనలపై 15 గంటల పాటు చర్చించాలని విపక్షాల డిమాండ్‌ను కేంద్రం అంగీకరించింది. ఇందుకు రాజ్యసభలో రెండు రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. రాజ్యసభలో జరిగే ఈ చర్చకు విపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, వారి అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని, చర్చా అర్థవంతంగా సాగాలని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే రైతుల సమస్యలు, వ్యవసాయ చట్టాలపై చర్చ మొదలవుతుందని, ఇది రెండు రోజుల పాటు సాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బుధవారం ఉదయం సభలో ప్రకటించారు. సభ ప్రారంభమైన తరువాత రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని, ఇందుకు ఐదు గంటలు కేటాయించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఈ విషయమై నినాదాలు చేస్తూనే ఉండటంతో, వారిని సభ నుంచి సస్పెండ్ చేసిన చైర్మన్, ఆపై సభను వాయిదా వేశారు. ఆ వెంటనే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ ప్రకటన విడుదల చేశారు. విపక్ష సభ్యుల డిమాండ్‌ను అంగీకరిస్తూ 15 గంటల పాటు రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. రైతులకు మేలు చేయాలనే కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. దీనిపై రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్.. ‘మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించినందున రైతుకు సంబంధించిన అన్ని సమస్యలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం.. అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ముందే ఇది జరగాలని, లేదంటే మరింత ఎక్కువ సమయం కేటాయించాలి’వ్యాఖ్యానించారు. ఇక రెండు రోజుల పాటు ప్రైవేటు మెంబర్ బిల్లులను, సభ్యులు లేవనెత్తే సమస్యలపై చర్చలకు అనుమతించబోమని రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. అంతకు ముందు ఆఫ్ ఎంపీలు సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్డీ గుప్తాలను సభ నుంచి ఈ రోజంతా బహిష్కరించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు జీరో అవర్ అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ముగ్గురు ‘ఆప్’ ఎమ్మెల్యేలు తమ సీట్లలో నుంచి లేచి నిలుచుని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.


By February 03, 2021 at 01:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/consensus-in-parliament-nearly-15-hour-discussion-on-farmers-protest-says-govt/articleshow/80665559.cms

No comments