Breaking News

సౌత్ వెస్ట్రన్ కమాండ్ అధికారుల మధ్య ఘర్షణ.. ఆర్మీ చీఫ్ కీలక నిర్ణయం


సైన్యానికి చెందిన కీలక జైపూర్‌ సౌత్ వెస్ట్రన్ కమాండ్ (ఎస్‌డబ్ల్యూసీ)లోని ఇద్దరి అధికారుల మధ్య కొనసాగుతున్న విభేదాలపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ (సీఓఐ) నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఇటువంటి వివాదం తెరపైకి రావడం ఇదే తొలిసారి. ఎస్‌డబ్ల్యూసీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్ క్లెర్, కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ కె కె రెప్సావాల్ ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదులను మంగళవారం ఉపసంహరించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కోర్టు ఆఫ్ ఎంక్వైరీ కొద్ది రోజుల్లో నివేదిక సమర్పించనుందని, దీని ఆధారంగా జనరల్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయ. లక్నో సెంట్రల్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఐ ఎస్ ఘుమన్ సీఓఐకి నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం ఘర్షణ పడిన అధికారుల కంటే ఈయన సీనియర్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొన్ని రంగాలలో అధికారాన్ని దుర్వినియోగం సహా అడ్మినిస్ట్రేషన్ లోపాలపై ఇరువురు అధికారులు తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్మ్‌డ్ కార్ప్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ క్లేర్ ఈ ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేయనుండగా.. కార్ప్స్ ఇంజనీర్స్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ రెప్సావాల్ కోల్‌కతాలోని ఈస్ట్రన్ కమాండ్‌కు బదిలీ అయ్యారు. ఇరువురు అధికారులు ప్రముఖ సైనిక కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. గతంలో వీరి కుటుంబాలకు చెందిన అనేక మంది ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధికారులు ఇద్దరి మధ్యా దీర్ఘకాలం నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అధికారుల తీరును తీవ్రంగా పరిగణించిన ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే.. దీనిపై విచారణకు జనవరి 31న పదవీ విరమణ చేసిన వైస్-చీఫ్ లెప్టినెంట్ జనరల్ ఎస్కే సైనీని నియమించారు. అయితే, ఇరువురు అధికారులు పలు సీరియస్ అంశాలను లేవనెత్తడంతో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి నరవాణే ఆదేశించారు. ఎస్‌డబ్ల్యూసీ పనితీరుపై ఇది రోజు రోజుకూ మరింత ప్రభావం చూపుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. సీనియర్ లెఫ్టినెంట్ జనరల్స్ అధీనంలో ఉండే ఆర్మీకి చెందిన ఆరు ఆపరేషనల్ లేదా రీజినల్ కమాండ్స్‌లో ఎస్‌డబ్ల్యూసీ ఒకటి. ఇండో-పాక్ సరిహద్దుల్లో సైనిక సామర్ధ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2005లో దీనిని ఏర్పాటుచేశారు. గడచిన 2-3 దశాబ్దాలుగా ఆర్మీ కమాండర్లు, సీనియర్ సబార్డినేట్ల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఈ వివాదం తెరపైకి రావడం ఇదే మొదటిసారి.


By February 03, 2021 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-lt-gens-at-war-withdraw-complaints-as-army-chief-orders-court-of-inquiry/articleshow/80663288.cms

No comments