Breaking News

ఉత్తరాఖండ్ విలయం.. పెను శాపంగా మారిన భూతాపం, మానవ చర్యలు


ప్రకృతి సమతౌల్యతను దెబ్బతీస్తే ఏం జరుగుతుందో మరోసారి ఉత్తరాఖండ్ మంచు చరియలు విరిగిపడిన ఘటన నిరూపించింది. విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో హిమాలయాలకు తీవ్ర ముప్పు వాటిళ్లుతోంది. వాటి నుంచి వెలువడే వేడికి నిలువెల్లా మంచు కొండలు కరిగిపోతున్నాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన హిమాలయ పర్వతాలపై ఉన్న హిమానీ నదాలు తరిగిపోయి, జలవిలయానికి కారణమవుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌ను విపత్తునకు భూతాపం అత్యంత ప్రధానమైన కారణం. అఫ్గానిస్థాన్‌ నుంచి మయన్మార్‌ వరకూ 3500 కిలోమీటర్ల మేర విస్తరించిన హిందుకుష్‌ హిమాలయాలు ఎవరెస్టు సహా ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరాలకు నిలయంగా ఉన్నాయి. ధ్రువ ప్రాంతాలకు వెలుపల ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు హిమ రూపంలో ఉండగా.. కోట్లాది మందికి ఇవి ప్రాణాధారం. హిమానీ నదాలు.. గంగా, మెకాంగ్‌, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు మూలధారం. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా హిమానీనద మంచు నిక్షిప్తమై ఉంది. వాతావరణ మార్పులు, మానవ చర్యలు, పెరుగుతున్న భూతాపం వల్ల హిమాలయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల ఫారెన్‌హీట్ మేర పెరిగినట్టు ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవలప్‌మెంట్‌ (ఐసీఐఎంవోడీ) అధ్యయనంలో తేలింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే భూతాపం ప్రభావం ఇక్కడే ఎక్కువగా ఉందని, దీని ఫలితంగా హిమానీనదాలు వేగంగా తరిగిపోతున్నాని పేర్కొంది. మంచు కరగడం, వాతావరణ తీరుతెన్నులూ గందరగోళానికి కారణమని వివరించింది. హిమనీ నదాల తిరోగమనం నుంచి ఏర్పడిన అస్థిర సహజ ఆనకట్ట వల్ల మంచు చరియలు విరిగిపడి ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. హిమానీ నదాలు మంచు కదిలే పెద్ద భాగాలు.. కాబట్టి, హిమానీనదం వెనక్కి మళ్లినప్పుడు, భూమిలోపలికి వెళ్లి నీటితో నిండిన ఒక సరస్సు ఏర్పడుతుంది. కెనడాకు చెందిన కాల్గరీ యూనివర్సిటీ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం.. దీనిని మొరైన్ అని పిలుస్తారు, ఇది శిథిలాలు, కూరుకుపోయి మంచుతో ఏర్పడతాయి. నీటి మట్టం పెరగడం, హిమానీనదం వెనక్కి తగ్గడంతో మొరైన్‌లు బలహీనపడతాయి. సరస్సు నుంచి వచ్చిన ఒత్తిడితో కూలిపోయినప్పుడు భారీ వరదలకు దారితీస్తుంది. ఇక, ఉత్తరాఖండ్‌లో ఈ శీతాకాలంలో హిమపాతం తగ్గింది. దాని వల్లే తాజాగా మంచు చరియలు విరిగిపడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఇది జరగడం అసాధారణమేనని అంటున్నారు. శీతాకాలంలో వర్షం, హిమపాతం వల్ల హిమానీ నదాలు పరిపుష్టమవుతాయి. ఈ ఏడాది ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో హిమపాతం తక్కువగా ఉండటం వల్ల హిమానీనదాలు నిర్మాణపరమైన లోపాలు సరికాలేదని పేర్కొన్నారు. అందువల్లే ఈ విపత్తు జరిగి ఉంటుందని చెప్పారు.


By February 08, 2021 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttarkhand-glacial-outburst-flood-what-is-it-and-how-does-it-occur/articleshow/80741819.cms

No comments