Breaking News

మధ్యప్రదేశ్: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 30 మందికిపైగా జలసమాధి


మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. బస్సు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు.. సిధి జిల్లా పట్నా వద్ద వంతెనపై నుంచి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం వేగంగా నడుపుతూ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు. వంతెనపై నుంచి పడిన తర్వాత బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్వలో ప్రవాహానికి బస్సు కొంతదూరం కొట్టుకెళ్లిపోయినట్టు వివరించారు. ప్రమాద సమయానికి మొత్తం 60 మంది ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ బస్సు సిధి నుంచి సత్నాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత వాటిని గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాల్వలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ఎగువన బన్‌సాగర్ డామ్ నుంచి నీటి విడుదలను నిలిపివేయాలని అధికారులకు సూచించారు.


By February 16, 2021 at 12:47PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/more-than-30-killed-due-to-bus-falls-into-canal-in-madhya-pradesh/articleshow/80972606.cms

No comments