Breaking News

నేడు రైతుల రైలు రోకో.. 20 వేల మంది ఆర్పీఎఫ్ దళాలతో భారీ భద్రత


కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు మూడు నెలలుగా అన్నదాతలు ఉద్యమం కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా ఆందోళనలు చేస్తున్న రైతులు.. ఇందులో భాగంగా గురువారం రైల్‌ రోకోకు పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహించనున్నారు. దీంతో ఎర్రకోట హింసను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే శాఖ అప్రమత్తమయ్యింది. దాదాపు 20 వేల మంది రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)‌ సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరించనుంది. ముఖ్యంగా పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పశ్చిమబెంగాల్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆందోళనలు, నిరసనలు శాంతియుతంగా తెలపాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగాలను సమన్వయం చేసుకుని ముందుకెళతామని అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ‘నిఘా వర్గాల సాయం తీసుకుంటాం.. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్ సహా ఇతర కొన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టాం.. ఈ ప్రాంతాల్లో 20 వేల మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించాం.. రైల్‌రోకో జరిగే 4 గంటలు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం’ అని అన్నారు. కాగా, జనవరి 26న ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఘటనల్లో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. మణీందర్‌ సింగ్‌ అనే ఈ వ్యక్తి తన వద్దనున్న నాలుగున్నర అడుగుల కత్తులను తిప్పుతూ నిరసనకారులను రెచ్చగొట్టినట్లు ఆరోపించారు. మణీందర్ ఢిల్లీలో కత్తిసాముపై శిక్షణ ఇస్తుంటాడని వెల్లడించారు. మరోవైపు, సరిహద్దుల్లో నిరసన చేస్తున్న ఓ రైతు నాయకుడిని హత్య చేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరిగిందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీని వెనుక ఖలిస్థాన్‌ కమాండో ఫోర్స్‌ (కేసీఎఫ్‌) ఉందని తెలిపాయి.


By February 18, 2021 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmer-groups-call-rail-roko-andolan-railways-deploys-20-additional-rpsf-companies/articleshow/81081517.cms

No comments