Breaking News

పీపీపీ విధానంలో 150 అత్యాధునిక రైళ్లు.. ఏపీ, తెలంగాణ‌లోని 14 మార్గాల్లో


తొలిసారి దేశంలో ప్రయివేట్ రైళ్ల నడపడానికి సిద్ధమైన కేంద్రం.. ఇందుకు సంబంధించిన విధి, విధానాలను కూడా గతంలోనే ప్రకటించింది. తాజాగా, దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ శుక్రవారం అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో త్వరలో 150 ఆధునిక రైళ్లు నడపనున్నట్లు గోయెల్‌ వెల్లడించారు. ఇందు కోసం ప్రతిపాదనలు కోరామని, ఇందుకు 12 క్లస్టర్‌ రూట్లను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ప్రయాణ ఛార్జీలు నిర్ణయించుకునే స్వేచ్ఛ, వాటిని ఏయే స్టేషన్లలో నిలపాలనే నిర్ణయం కూడా ప్రైవేటు ఆపరేటర్లకే కేంద్రం కట్టబెట్టింది. మొత్తం 109 మార్గాల్లో 150కిపైగా నడపడానికి రైల్వే శాఖ అనుమతించింది. ఆ మార్గంలో రైల్వే శాఖ నడుపుతున్న అత్యంత వేగవంతమైన రైళ్ల కంటే ప్రైవేట్ రైళ్ల స్టాప్‌లు ఎక్కువ ఉండవు. 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించబోయే ప్రైవేట్ రైళ్ల ఛార్జీలను రైల్వే శాఖ నియంత్రించదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రైవేట్ ఆపరేటర్లు నిర్ణయించుకోవచ్చు. ప్రైవేట్ రైళ్లను నడపడానికి ఆసక్తి చూపిన 23 సంస్థలలో బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇండియా, సిమెన్స్ లిమిటెడ్, ఆల్సోటామ్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియా లిమిటెడ్ తదితర సంస్థలు ఉన్నాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని 14 మార్గాల్లో ప్రయివేట్ రైళ్లు నడవనున్నాయి. విజయనగరం- పూరి (వారానికి మూడు సర్వీసులు), హౌరా- విజయవాడ-చెన్నై (ప్రతి రోజూ), సికింద్రాబాద్‌- శ్రీకాకుళం (ప్రతి రోజూ), హైదరాబాద్‌- తిరుపతి (ప్రతి రోజూ), గుంటూరు- హైదరాబాద్‌ (ప్రతి రోజూ), తిరుపతి- సికింద్రాబాద్‌-వారణాసి (వారానికి రెండుసార్లు), తిరుపతి- నర్సాపూర్‌ వయా విజయవాడ (బైవీక్లీ), విశాఖపట్నం-బెంగళూరు (బైవీక్లీ), విశాఖపట్నం- విజయవాడ (ప్రతి రోజూ), హౌరా- సికింద్రాబాద్‌ (ప్రతిరోజూ), చెన్నై- తిరుపతి (వీక్లీ), పాండిచ్చేరి- కాచిగూడ (ప్రతి రోజూ), మైసూరు- విజయవాడ- భువనేశ్వర్‌ (ప్రతి రోజూ), హౌరా- బెంగళూరు (ప్రతి రోజూ) మార్గాల్లో ఆధునిక రైళ్లు నడవనున్నాయి.


By February 13, 2021 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/150-private-trains-will-running-soon-says-railway-minister-piyush-goyal-in-rajya-sabha/articleshow/80891168.cms

No comments