Breaking News

ఖాళీ చేయించడానికి వచ్చిన పోలీసులకు రైతులు షాక్.. వెనక్కు మళ్లిన బలగాలు


కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న రైతులు.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రైతులు తమకు నిర్దేశించిన మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో ర్యాలీ చేపట్టడంతో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపూర్‌లో ధర్నా చేస్తున్న రైతులు గురువారం రాత్రిలోపు ఖాళీ చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఒక వేళ రైతులు అక్కడి నుంచి ఖాళీ చేయకపోతే బలవంతంగానైనా ఖాళీ చేపిస్తామని పేర్కొన్నారు. దీనిపై రైతు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ధర్నా చేస్తున్న తమను అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకోవడానికైనా సిద్ధమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ తికాయత్‌ హెచ్చరించారు. రైతులపై దాడి చేయొద్దని రాకేష్ తికాయత్‌ కన్నీటి పర్యంతం అయ్యారు. బీజేపీ నేతలు హింసకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అరెస్టులు చేసినా, కాల్పులు జరిపినా తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకోవడాకైనా సిద్ధమని ప్రకటించారు. ధర్నా చేస్తున్న రైతులకు నోటీసులు జారీచేసిన అధికారులు.. పెద్దఎత్తున భద్రతా బలగాలు అక్కడ మోహరించారు. మరోవైపు అక్కడి నుంచి ఖాళీ చేసేందుకు రైతు సంఘం నేతలు, రైతులు నిరాకరిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వందలాది మంది భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే బైఠాయించారు. రైతులు దీక్షా శిబిరానికి విద్యుత్ సరఫరాను గురువారం సాయంత్రం నుంచి నిలిపివేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘజియాబాద్ కలెక్టర్ అజయ్ శంకర్ పాండే, సీనియర్ ఎస్పీ కళానిధి నైథానిలు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యూపీ గేట్ వద్ద అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో 500 మంది వరకు ఆందోళనకారులు బైఠాయించగా.. వారికి మద్దతుగా పశ్చిమ్ యూపీ నుంచి భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గారు. అదనపు భద్రతా బలగాలను దీక్షా స్థలి నుంచి వెనక్కు రప్పించామని, అతికొద్ది మందిని మాత్రమే ఉంచినట్టు ఘజియాబాద్ పోలీస్ అధికారి వెల్లడించారు. గురువారం సాయంత్రం నుంచి అదనపు బలగాలను మోహరించడంతో ఉద్రిక్తతకు కారణమని అన్నారు. త్రివర్ణ పతాకం, శ్రామిక జెండాలను చేతబట్టి ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాలు చేస్తూ ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు అక్కడే కూర్చున్నారు. తాము ఈ ప్రాంతాన్ని ఖాళీచేసే ప్రసక్తే లేదని, బలవంతంగా తమను ఎవరూ ఖాళీచేయించలేరని రైతులు స్పష్టం చేశారు. అంతేకాదు, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకుందని సుప్రీంకోర్టు చెప్పిందని, న్యాయస్థానం ఏం చెప్పిందో దానినే మేం అనుసరిస్తున్నాం అని పునరుద్ఘాటించారు.


By January 29, 2021 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmers-protest-at-ghazipur-farmers-stay-put-at-up-gate-excess-force-removed/articleshow/80546708.cms

No comments