హెల్త్ వర్కర్ మృతికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదు.. పోస్టుమార్టం నివేదిక
యూపీ వార్డు బాయ్ మరణానికి కొవిడ్ వ్యాక్సిన్తో ఎలాంటి సంబంధం లేదని వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం నివేదిక వివరాలను మీడియాకు వెల్లడించారు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించాడని స్పష్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని మొరదాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో వార్డు బాయ్గా పనిచేస్తున్న 46 ఏళ్ల మహిపాల్ శనివారం తొలి దశలో భాగంగా పంపిణీ చేసిన డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్న 24 గంటల్లోనే మృతి చెందారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న వేళ ఇది ప్రకంపనలు రేపింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే మహిపాల్ మరణించాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించారు. టీకా తీసుకున్న అనంతరం మహిపాల్ అస్వస్థతకు గురయ్యారని.. ఇబ్బందికరంగా ఫీలయ్యారని కుటుంబసభ్యులు తెలిపారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయణ్ని ఆస్పత్రికి తీసుకురాగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. వార్డు బాయ్ మృతదేహానికి ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం పోస్టుమార్టం నిర్వహించిందని యూపీ సమాచార శాఖ అదనపు కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు. లక్నోలో సోమవారం (జనవరి 18) ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ వ్యాక్సిన్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. మహిపాల్ మృతికి వ్యాక్సిన్ కారణం కాదని తెలిపారు. మహిపాల్ కొవిషీల్డ్ టీకా తీసుకున్నట్లు చెప్పారు. Also Read: ✦ ✦
By January 18, 2021 at 01:44PM
No comments