Breaking News

ఖాతాలో నగదు కోం బ్యాంకుకు ‘మృతుడు’... భయంతో పరుగులు తీసిన ఉద్యోగులు


చనిపోయిన వ్యక్తి ఖాతాలోని నగదు కోసం మృతదేహాన్ని తీసుకుని గ్రామస్తులు బ్యాంకు వచ్చిన ఘటన బీహార్‌లోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజధాని పట్నా సమీపంలోని షాజహాన్‌పూర్ పరిధిలో సిగరియావా గ్రామంలో కెనరా బ్యాంకు బ్రాంచ్ ఉంది. అదే గ్రామానికి చెందిన మహేష్ యాదవ్ (55)‌కు ఆ బ్యాంకులో ఖాతా ఉండగా.. అతడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి అంత్యక్రియల నిర్వహణకు డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లి ఖాతాలోని డబ్బులు కావాలని అక్కడి సిబ్బందిని అడిగారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. మహేష్ యాదవ్ మృతదేహాన్ని నేరుగా బ్యాంకుకు తీసుకొచ్చారు. ఊహించని ఈ పరిణామానికి బ్యాంకు సిబ్బంది ఖంగుతిన్నారు. దాదాపు మూడు గంటలపాటు మహేష్ మృతదేహంతో బ్యాంకులోనే బైఠాయించారు. బ్యాంకు మేనేజర్ వారికి ఎంత నచ్చజెప్పినా వినిలేదు. చివరకు చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరు తన సొంత డబ్బులు రూ. 10 వేలు ఇచ్చి గ్రామస్తులను అక్కడ నుంచి పంపేశారు. అక్కడ నుంచి వెళ్లిపోయిన గ్రామస్తులు ఆ సొమ్ముతో మహేష్ యాదవ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్‌ అవివాహితుడు కాగా.. అతడికి కుటుంబసభ్యులు, బంధువులెవరూ లేరు. అయితే, అతడి బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలకుపైగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి నామినీ ఎవరూ లేకపోవడంతోనే ఖాతాలోని సొమ్మును ఇవ్వడానికి బ్యాంకు మేనేజర్ నిరాకరించారు.


By January 06, 2021 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/villagers-protest-with-dead-body-in-bank-and-demand-money-for-his-account-in-bihar/articleshow/80126410.cms

No comments