నేడు ఎనిమిది కొత్త రైళ్లు ప్రారంభం.. అత్యాధునికి రైలు బోగీలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ప్రధాని
గుజరాత్లోని కెవాడియాకు దేశంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానం చేసే ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభించనున్నారు. కెవాడియాలో సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ నుంచి కెవాడియా మధ్య నడిచే జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు నేటి నుంచి అత్యాధునిక విస్టా డోమ్ కోచ్ లను జోడించనున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ కోచ్లు ప్రయాణికులకు కొత్త అనుభూతిని మిగుల్చుతాయని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే మరిన్ని రైళ్లకు ఇవే తరహా కోచ్లను రైల్వే శాఖ అనుసంధానించనుందని తెలిపారు. ఈ కోచ్లు బయటి ప్రపంచాన్ని మరింతగా చూపిస్తాయి. పై భాగం అధిక శాతం పారదర్శకంగా అద్దాలతో ఉంటుంది. ఈ రైలు గుజరాత్లోని నర్మదా నదిపై నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మీదుగా సాగుతుందని మోదీ గుర్తుచేశారు. ఈ రైల్లో ప్రజలు ఇకపై మరింత ఆనందంగా ప్రయాణిస్తూ, అత్యద్భుత సర్దార్ పటేల్ విగ్రహ సందర్శనకు వెళ్లవచ్చని అన్నారు. విస్టాడోమ్ కోచ్లను అనుసంధానించిన రైళ్ల జాబితాను కూడా మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కెవాడియా - వారణాసి మహామన ఎక్స్ప్రెస్, దాదర్ - కెవాడియా ఎక్స్ప్రెస్, కెవాడియా - హజ్రత్ నిజాముద్దీన్ బై వీక్లీ ఎక్స్ప్రెస్, కెవాడియా - రేవా వీక్లీ ఎక్స్ప్రెస్, చెన్నై - కెవాడియా వీక్లీ ఎక్స్ప్రెస్, ప్రతాప్నగర్ - కెవాడియా మెమూ రైళ్లకు వీటిని అమర్చనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, రైల్వే మంత్రి పియూష్ గోయల్ పాల్గొననున్నారు. కెవాడియాతో అనుసంధానం చేసే రైళ్లతోపాటు దబోయ్-చందోడ్, చందోడ్-కెవాడియా మార్గంలో నిర్మించిన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని ప్రారంభించనున్నారు. దేశంలోనే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికెట్ పొందిన తొలి రైల్వే స్టేషన్గా కెవాడియా నిలిచింది.
By January 17, 2021 at 09:00AM
No comments