అధికార మార్పిడి సందర్భంగా అమెరికాలో హింస.. ట్రంప్కి మోదీ పరోక్షంగా చురకలు!

అమెరికా అధికార మార్పిడి సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించే సమావేశం హింసాత్మకంగా మారింది. కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగా ఆందోళనకారులు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించగా.. వారి కళ్లలోకి రసాయనాలు చల్లారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో ఓ మహిళ చనిపోగా, పలువురు గాయపడ్డారు. వీరిలో పోలీసులు కూడా ఉన్నారు. ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ట్రంప్ మద్దతుదారులు భయానక వాతావరణం సృష్టించడంతో సమావేశం నిలిచిపోయింది. ఆందోళనకారులు నాలుగు గంటల పాటు అక్కడే తిష్టవేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ను రంగంలోకి దింపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆందోళనకారులు ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. అమెరికా క్యాపిటల్ భవనంలో చోటుచేసుకున్న ఘటనపై భారత స్పందించారు. ప్రజాస్వామ్య విధానంలో ఇటువంటి ఆందోళనలకు చోటులేదని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఘటన తనను షాక్కు గురిచేసిందన్నారు. అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని మోదీ పేర్కొన్నారు.. నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆటంకపరచడం సరికాదని ప్రధాని హితవు పలికారు. ‘వాషింగ్టన్ డీసీలో హింస, ఘర్షణ కలచివేసింది.. అధికారి మార్పిడి శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగాలి.. చట్టవిరుద్దమైన నిరసనలు, ఆందోళనలతో ప్రజాస్వామ్య ప్రక్రియ అణచివేయడానికి అంగీకరించలేం’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రక్రియపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపణలు గుప్పించారు. అధికారాన్ని డెమొక్రాట్లు తమ నుంచి లాక్కున్నారని ధ్వజమెత్తారు.
By January 07, 2021 at 09:09AM
No comments