Breaking News

ట్రాక్టర్ల ర్యాలీలో హింస.. చలో పార్లమెంట్‌పై రైతులు కీలక నిర్ణయం


రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన కిసాన్ పరేడ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఫిబ్రవరి 1న తలపెట్టిన సంసద్ మార్చ్‌ను రైతు సంఘాలు వాయిదా వేశాయి. దీనికి బదులు జనవరి 30 మహాత్మా గాంధీ వర్దంతి రోజున ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించారు. ‘ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, బీజేపీ-ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉన్న నటుడు దీప్ సిద్ధూ సహకారంతో కేంద్రం కుట్ర పన్నింది.. దీని కారణంగా మంగళవారం నాడు హింస చెలరేగింది’ అని రైతు సంఘాలు ఆరోపించాయి. సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ.. నిరసనకారులను ఎర్రకోట వైపు వెళ్లాలని ఢిల్లీ పోలీసులు బలవంతం చేశారని, ఈ కుట్ర కోణాన్ని బహిర్గతం చేస్తామని అన్నారు. ‘కుట్రలో భాగంగా ఎర్రకోట వద్ద పోలీస్ పోస్ట్‌ల నుంచి భద్రతా బలగాలు తప్పుకుని, అందులో చొరబడేందుకు పోకిరీలకు అవకాశం కల్పించారు.. నటుడు దీప్ సిద్ధూ తన ఉనికిని చాటుకున్నాడు’ అని రాజేవాల్ మండిపడ్డారు. మీడియా సమావేశానికి ముందు.. హింసాత్మక సంఘటనలపై యూనియన్లు చర్చించాయని, నాయకులు ఆందోళనతో కేంద్రం వణికినట్టు భావించారు. రైతు సంఘాలు జనవరి 26 కిసాన్ పరేడ్ ప్రకటించినప్పుడు దీప్ సిద్ధూ, కేఎంఎస్సీ వంటి బీజేపీ అనుకూలురు ఆందోళనను తమచేతుల్లోకి తీసుకోడానికి ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. ‘సంయుక్త కిసాన్ మోర్చాలో సభ్యులుగా మేము కవాతుకు పిలుపునిచ్చినందున, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు నైతిక బాధ్యతను మేం వహిస్తున్నాం’ అని జై కిసాన్ ఆందోళన్ నేత యోగేంద్ర యాదవ్ అన్నారు. ‘మేము ‘సంసాద్ మార్చ్’ను రద్దు చేయలేదు. వాయిదా మాత్రమే వేశాం... ఇది తరువాత జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లు (వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ) నెరవేరే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. దీప్ సిద్ధూ సామాజిక బహిష్కరణకు మోర్చా నాయకులు పిలుపునిచ్చారు.. ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనను పవిత్ర చర్యగా పేర్కొన్నారు. తమపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ల నమోదు గురించి స్పందిస్తూ.. ఇలాంటి ఉద్యమంలో ఇది సాధారణమని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. అంతేకాదు, ఇది మా నిరసనలను ఉద్ధృతం చేయకుండా నిరోధించదు’ అని ఆయన అన్నారు. ఉద్యమంలో కేవలం 10 శాతం మంది రైతులు మాత్రమే తమ ఆదేశాలను పాటించకుండా నిర్దేశిత మార్గం నుంచి తప్పుకున్నారని, వీరిలో ఎక్కువగా కేఎంఎస్సీ సభ్యులు ఉన్నారన్నారు. 90% మంది మాత్రం నిర్దేశిత మార్గంలో ఉండి, శాంతియుతంగా కవాతులో పాల్గొన్నారని పేర్కొన్నారు.


By January 28, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmers-put-off-february-1-parliament-march-due-to-republic-day-parade-violence/articleshow/80491593.cms

No comments