Breaking News

చైనా, పాకిస్థాన్‌కు చెక్ పెట్టేలా భారత్ మరో కీలక నిర్ణయం


లడఖ్ సరిహద్దుల్లో చైనా సైన్యం దుందుడుకుగా వ్యవహరిస్తోన్న వేళ.. భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి 21 మిగ్-29 యుద్ధ విమానాలతోపాటు 12 సుఖోయ్-30ఎంకేఐ ఫైటర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దేశీయంగా 83 తేజస్ యుద్ధ విమానాల తయారీకి కేబినెట్ భద్రతా కమిటీ గత వారం అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 59 మిగ్-29 జెట్లు ఉండగా.. ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 272 సుఖోయ్-30ఎంకేఐ ఫైటర్ల కొనుగోలు కోసం భారత్ ఇప్పటికే రష్యాతో 15 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు తీసుకోబోతున్న 12 ఫైటర్లు వీటికి అదనం. 272 సుఖోయ్ ఫైటర్లలో 268 యుద్ధ విమానాలను భారత వాయుసేనలో ప్రవేశపెట్టారు. కాగా వీటిలో 9 ప్రమాదాల బారిన పడి కూలిపోయాయి. 83 తేజస్ యుద్ధ విమానాలు 2024 జనవరి నుంచి 2028 డిసెంబర్ మధ్య ఎయిర్ ఫోర్స్‌కు అందించనున్నారు. ఇందుకోసం కేబినెట్ భద్రతా కమిటీ రూ.46,898 కోట్ల ఒప్పందానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అదనంగా మిగ్-29, సుఖోయ్ యుద్ధవిమానాలు చేరితో ఎయిర్‌ఫోర్స్ మరింత బలోపేతం అవుతుంది. చైనా, పాకిస్థాన్ నుంచి ముప్పును ఎదుర్కోవడానికి కనీసం 42 స్క్వాడ్రన్లు (ఒక్కో స్క్వాడ్రన్‌లో 16-18 జెట్లు ఉంటాయి) అవసరం కాగా.. మన దగ్గర మిగ్-21, మిగ్-23, మిగ్-27 యుద్ధ విమానాలు పాతవి కావడంతో.. ప్రస్తుతం 30 స్క్వాడ్రన్లు మాత్రమే ఎయిర్‌ఫోర్స్‌కు అందుబాటులో ఉన్నాయి. నాలుగు మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్లు 2024లో రిటైర్ కానున్నాయి. 21 అత్యాధునిక మిగ్-29ఎస్ యుద్ధ విమానాల కొనుగోలుతోపాటు.. ఇప్పటికే ఉన్న 59 ఫైటర్లను ఆధునికీకరించడం కోసం రక్షణ శాఖ 2020 జులైలో ప్రాథమికంగా అంగీకరించింది. ఇందుకోసం రూ.7418 కోట్లు అవసరమని అంచనా.


By January 18, 2021 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-to-procure-more-mig-29s-sukhois-to-counter-china-and-pakistan/articleshow/80324220.cms

No comments