Breaking News

విదేశాల్లో ఉన్నత చదువు.. ఇటీవలే ప్రేమ పెళ్లి.. రైతుల కోసం ఊపిరొదిలిన యువకుడు


గణతంత్ర దినోత్సవం నాడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారి, ఓ యువ రైతు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ర్యాలీలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌కి చెందిన నవ్రీత్ సింగ్ (24) ట్రాక్టర్ నడుపుతూ వాహనం బొల్లా పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన నవ్రీత్.. ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. విదేశాల్లోనే ఓ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న నవ్రీత్.. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పి బంధువులకు విందు ఏర్పాటు చేయాలని భావించాడు. ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల కిందట నవ్రీత్ ఆస్ట్రేలియా‌కు వెళ్లాడు. అక్కడే ఉంటున్న ఓ అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి వారితో వేడుకలు చేసుకునేందుకు ఇటీవలే స్వదేశానికి వచ్చారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి నవ్రీత్ మద్దతు తెలిపాడు. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన కిసాన్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. అయితే, దురదృష్టశాత్తూ దిల్లీ ఐటీవో క్రాసింగ్‌ వద్ద వేగంగా ట్రాక్టర్‌ నడిపి పోలీస్‌ బారికేడ్లను ఢీకొట్టాడు. దీంతో ట్రాక్టర్‌ బోల్తా పడి నవ్రీత్‌ చిక్కుకుపోయారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు. మెల్‌బోర్న్‌లో ఉన్న నవ్రీత్ భార్య మనస్విత (21) తన భర్త చనిపోయిన విషయం తెలిసి షాక్‌కు గురయిన ఆమె ఆ షాక్ నుంచి కోలుకోలేదు. నవ్రీత్ సింగ్ అంత్య క్రియలు బుధవారం ఆయన స్వగ్రామం దిబ్డిబాలో జరిగాయి. తన మనవడు ఉద్యమం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడని నవ్రీత్ తా హర్దీప్‌సింగ్ దిబ్డిబా అన్నారు. ‘రైతులు, వ్యవసాయం భవిష్యత్తు కోసం నా మనవడు తన జీవితాన్ని ఇచ్చి అమరుడయ్యాడు.. తన త్యాగాన్ని మేము గొప్ప గర్వంగా భావిస్తున్నాం’ అన్నారు. మంగళవారం జరిగిన ట్రాక్టర్ల ర్యాలీలో నవ్రీత్ బంధువులంతా పాల్గొన్నారు. నవ్రీత్ మృతదేహానికి పోస్ట్‌మార్టం ముగిసిన తర్వాత బుధవారం రాజస్థాన్ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనలో పాల్గొంటున్న అతడి తాత దిబ్డిబాకు పోలీసులు అందజేశారు. మేము దీనిని దేవుని చిత్తం గా అంగీకరిస్తున్నా.. రైతు ఉద్యమం కోసం నవ్రీత్ తన జీవితాన్ని త్యాగం చేశాడు.. ఎవరినీ మేము నిందించడం లేదు’అని ఆయన అన్నారు. ‘నవ్రీత్ మూడేళ్ల కిందట ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ వివాహం చేసుకున్నాడు.. నాలుగు నెలల కిందట పెళ్లి వేడుకల కోసం భారత్‌కు వచ్చాడు’ అని రాజస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధ్ కమిటీ అధ్యక్షుడు అన్నారు. అయితే పోలీసుల కాల్పుల్లో నవ్రీత్‌ చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆందోళనలు చేస్తున్న రైతులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారని, అందులోని ఒక షెల్‌ నవ్రీత్‌ తలకు తగలడంతో అతడు డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడని తోటి రైతులు ఆరోపించారు. ట్రాక్టర్‌ బోల్తా పడినప్పటికీ పోలీసులు సాయం చేయలేదని మండిపడ్డారు. ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఐటీవో క్రాసింగ్‌ వద్ద జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు.


By January 28, 2021 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/republic-day-violence-dead-farmer-was-just-back-from-australia-and-newly-married/articleshow/80491123.cms

No comments