నిజాముద్దీన్ రైలుకి ఎదురెళ్లి ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెలగావీ జిల్లా రాయ్బాగ్లోని భీరాముడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరు కుమారులతో కలిసి దంపతులు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. రాయ్బాగ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్పై నలుగురు మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. బుధవారం రాత్రి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి వీరంతా ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను బైరెడి గ్రామానికి చెందిన సతారప్ప సుతార్ (60), ఆయన భార్య మహాదేవి (50), పిల్లలు దత్తాత్రేయ (28), శంతను (25)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది తెలియరాలేదు. ఆర్ధిక సమస్యలతోనే ఈ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలిలో ఎటువంటి సూసైడ్ లేఖ లభ్యం కాలేదు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం రాయ్బాగ్ తాలూకా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన బెల్గామ్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పేర్కొన్నారు.
By January 28, 2021 at 10:19AM
No comments