Breaking News

యూపీలో కలకలం.. గ్రామ సర్పంచ్‌గా పాక్ మహిళ.. ఆలస్యంగా వెలుగులోకి


దాదాపు 40 ఏళ్ల కిందట వీసాపై పాకిస్థాన్ నుంచి భారత్‌‌లోని బంధువుల వివాహం కోసం వచ్చిన ఓ మహిళ.. యూపీలోని ఓ గ్రామానికి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతున్న తరుణంలో పాక్ మహిళ సర్పంచ్‌గా పనిచేయడం అధికారులు విస్తుపోతున్నారు. కరాచీకి చెందిన బానో బేగం దాదాపు 40 ఏళ్ల కిందట యూపీలో ఎటా జిల్లాలోని తన బంధువులను కలుసుకోడానికి వీసాపై వచ్చింది. ఈ క్రమంలో జలేసర్ బ్లాక్‌కు చెందిన అక్తర్ అలీ అనే వ్యక్తిని వివాహమాడింది. అప్పటి నుంచి దీర్ఘకాలిక వీసాపై భారత్‌లో నివాసం ఉంటోంది. ప్రస్తుతం బానో బేగం జలేసర్ బ్లాక్‌ తాత్కాలిక సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న విషయం తెలిసి అధికారులు విస్మయానికి గురయ్యారు. దీంతో బానో బేగంను వెంటనే గ్రామ ప్రధాన్ పదవి నుంచి తొలగించి దర్యాప్తునకు ఆదేశించారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఎటా జిల్లా పంచాయతీ రాజ్ అధికారి (డీపీఆర్వో) అలోక్ ప్రియదర్శి పోలీసులను కోరారు. సర్పంచ్‌గా ఎన్నిక కావడానికి అవసరమైన ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర ధ్రువపత్రాలను ఆమె ఎలా పొందారో దర్యాప్తు జరిపించాలని ఎటావా జిల్లా కలెక్టర్ శుఖ్‌లాల్ భారతి ఆదేశించారు. 35 ఏళ్ల కిందట పాకిస్థాన్ నుంచి వచ్చిన బానో బేగం (65) స్థానికుడైన అక్తర్ అలీని పెళ్లి చేసుకుని, దీర్ఘకాలిక వీసాపై యూపీలో ఉంటోంది. భారత పౌరసత్వం కోసం ఆమె పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా, ఆమె పాకిస్థానీ అని తెలియడంతో స్థానికుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బానో బేగం గౌడవ్ గ్రామ్ పంచాయతీలోని వార్డు సభ్యురాలిగా ఎన్నికైంది. గ్రామ ప్రధాన్ షెహనాజ్ బేగం గతేడాది జనవరి 9న మృతి చెందాడు. దీంతో గ్రామ కమిటీ చర్చించి బానో బేగంను తాత్కాలిక గ్రామ ప్రధాన్‌గా ఎన్నుకున్నట్టు డీపీఆర్ఓ అలోక్ ప్రియదర్శి తెలిపారు. ఆమెకు సాయం చేసిన వారిపైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సర్పంచ్ పదవికి బానో పేరును దయాన్ సింగ్ అనే వ్యక్తి సూచించినట్టు గుర్తించారు.


By January 01, 2021 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-women-becomes-gram-panchayat-head-in-uttar-pradesh-etah/articleshow/80055760.cms

No comments