Breaking News

క్వారీలో పేలుడు: 8 మంది మృతి.. భూకంపంగా భావించి వీధుల్లోకి పరుగులు తీసిన జనం


క్వారీలో పేలుడు సంభవించి ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. శివమొగ్గ సమీపంలోని అబాలేగెరే గ్రామంలో ఈ ఘటన సంభవించింది. మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని, కొన్ని డైనమేట్ స్టిక్స్ పేలకుండా ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాంబులను నిర్వీర్యం చేసే దళాలను పిలిపించిన పోలీసులు.. మొత్తం ఆ ప్రాంతాన్ని మూసివేశారు. క్వారీలో రాళ్ల తవ్వకాలకు లారీలో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తరుచూ పేలుడు పదార్థాలను తరలించే వ్యక్తులే ఈ ప్రమాదంలో మృతిచెందారు. పేలుడు ధాటికి లారీ ధ్వంసమయ్యింది. ‘ఘటన జరిగిన మొత్తం ప్రాంతాన్ని మూసివేశాం.. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను చూశాం.. క్వారీ లోపల చాలా మంది చనిపోయారు.. బెంగళూరు, మంగళూరు నుంచి బాంబు డిస్పోజల్ టీమ్‌లు కొద్ది గంటల్లో చేరుకోనున్నాయి.. ఇప్పటికీ డైనమేట్ స్టిక్స్ యాక్టివ్‌గా ఉండొచ్చు.. బాంబు స్క్యాడ్ వచ్చేవరకు ఎవర్నీ లోపలికి అనుమతించడంలేదు’ దేవనగెరె రేంజ్ సీనియర్ పోలీస్ అధికారి ఎస్ రవి తెలిపారు. పేలుడు గురువారం రాత్రి 10.20 ప్రాంతంలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని చిక్కమగలూరు జిల్లాలో కూడా భారీ శబ్దాలు, ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ శబ్ద తీవ్రతకు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. భూకంపం వచ్చిందేమోనని జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. కిటీకీల అద్దాలు పగిలిపోగా.. చుట్టుపక్కల భవనాలు స్వలంగా దెబ్బతినగా, జనం వీధుల్లో పరిగెడుతున్న ఫోటోలను ట్విట్టర్‌లో దర్శనమిచ్చాయి. శివమొగ్గ.. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సొంత జిల్లా. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యడియూరప్ప.. విచారణకు ఆదేశిచారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ఘటనపై స్పందించారు. ‘శివమొగ్గ ఘటన బాధాకరం.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని’ ట్వీట్ చేశారు.


By January 22, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/eight-dead-in-blast-at-quarry-in-karnatakas-shivamogga-area-sealed-off/articleshow/80398661.cms

No comments