Breaking News

రేపటి నుంచి అందరికీ పూరీ జగన్నాథుడి దర్శనం.. రోజుకు 30వేల మందికే అనుమతి


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి డిసెంబరు వరకు పూరీ జగన్నాథ ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో డిసెంబరు చివరి వారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. డిసెంబరు 23న ఆలయాన్ని తెరిచినా జనవరి 3 వరకూ సేవాయత్‌ల కుటుంబాలు, పూరీవాసులు మాత్రమే దర్శించుకున్నారు. వీరిలో పదేళ్లు నుంచి 60 ఏళ్లలోపు వారిని మాత్రమే తొలుత అనుమతించారు. తాజాగా, పదేళ్లలోపు చిన్నారులు మినహా అన్ని వయసులవారూ గురువారం నుంచి శ్రీక్షేత్రాన్ని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో దాదాపు పది నెలల తర్వాత జగన్నాథుని అందరూ దర్శించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ రిపోర్ట్ సమర్పించాల్సిన నిబంధనను ఎత్తివేశారు. భక్తులు తమ వెంట కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకోవాలన్న ఆదేశాలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో తాజాగా ఆ నిబంధన తొలిగించారు. రోజుకు 30వేల మంది భక్తులు స్వామిమని దర్శించుకోడానికి అనుమతి ఇవ్వనున్నట్లుగా తెలిపారు. కరోనా వైరస్ వేళ శ్రీక్షేత్రంలో నిబంధనలు కఠినంగా అమలు చేశారు. చివరకు ప్రపంచ ప్రసిద్ధి పొందిన రథయాత్రకు కూడా భక్తులను అనుమతించలేదు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలివచ్చి పాల్గొనే రథయాత్రలో గతేడాది ఆలయ సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. రోజుకు 30 వేల మందికి అనుమతిస్తామన్న పూరీ కలెక్టరు సమర్థవర్మ సంఖ్య పెరిగినా వెనక్కి పంపించబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధులపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నామని, వారికి ప్రత్యేక ప్రవేశ మార్గం ఏర్పాటు చేస్తున్నామని, శీఘ్రదర్శనం చేసుకోగలుగుతారని చెప్పారు. అన్ని బారికేడ్‌ మార్గాల్లో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అంతా మాస్కులు ధరించి రావాలని, బారికేడ్‌ ప్రవేశం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారన్నారు. తర్వాత వరుస క్రమంలో సింహద్వారం వద్దకు చేరుకున్న వారి చేతులను శానిటైజ్‌ చేస్తారని, అనంతరం లోపలికి అనుమతిస్తారని తెలిపారు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పూరీవాసులు నిత్యం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, పూరీయేతరులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు స్వామి దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. పదేళ్లలోపు పిల్లలను తీసుకురాకూడదని వర్మ సూచించారు.


By January 20, 2021 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/except-ten-years-below-children-all-ages-devotees-to-allow-puri-jagannath-temple-from-tomorrow/articleshow/80357077.cms

No comments