Breaking News

ప్రియురాలితో నెల్లూరు, తిరుపతి.. చివరికి గుంటూరులో దారుణం


సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చంపేసి పరారయ్యాడో ప్రబుద్ధుడు. ఏడాది నుంచి తప్పించుకు తిరుగుతున్న ప్రియుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ముత్తులూరుకి చెందిన తీర్ల రాజుకి వివాహమై పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుకునే రాజుకి ఆళ్లగడ్డకి చెందిన వివాహిత సుజాతతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకుని ఊరి నుంచి వెళ్లిపోయారు. నెల్లూరు, తిరుపతిలో కొద్దికాలం ఉండి తర్వాత గుంటూరుకు మకాం మార్చారు. నగర శివారులోని ఏటుకూరులో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటూ కూలీ పనులకు వెళ్లేవారు. వ్యసనాలకు బానిసైన రాజు నగరంపాలెం పరిధిలోని ఓ గుడిలో హుండీ చోరీ చేసి దొరికిపోయాడు. ఆ కేసులో రిమాండ్ విధించడంతో జైలుకెళ్లాడు. అతనికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు సుజాతకు తమతో పనులకు వచ్చే రంగనాయకులు సహకరించాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడంతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అనంతరం ఏటుకూరులోని ఇల్లు ఖాళీ చేయించి నల్లచెరువు పరిధిలోని వర్కర్స్ కాలనీలో తన ఇంటి పక్కన పోర్షన్ రాజుకు అద్దెకు ఇప్పించాడు. సుజాత, రంగ సన్నిహితంగా ఉండడం గమనించిన రాజు వారితో గొడవపడ్డాడు. దీంతో రంగనాయకులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. మరొకరితో సన్నిహితంగా ఉండడం భరించలేకపోయిన రాజు ప్రియురాలిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ 8న సుజాతతో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోయాక చీరతో ఫ్యానుకు వేలాడదీశాడు. పొరపాటున ఫ్యాను స్విచాన్ చేయడంతో చీర తెగి ఆమె కిందపడిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న రాజు.. ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మూడు రోజుల అనంతరం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు రాజుని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. Also Read:


By December 26, 2020 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-police-reveals-woman-murder-mystery-after-year/articleshow/79963955.cms

No comments