Breaking News

కొడుకుమీద కోపం.. పెంపుడు కుక్కకు సగం ఆస్తి రాసిచ్చిన రైతు


కొడుకు ప్రవర్తన నచ్చక ఓ రైతు తన ఆస్తిలో సగం పెంపుడు శునకం పేరున రాసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో చోటుచేసుకుంది. బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయణ వర్మ అనే రైతుకు తన పెంపుడు శునకం (జాకీ) అంటే చాలా ఇష్టం. కుమారుడి ప్రవర్తనతో విసిగిపోయిన ఆయన ఆస్తిలో సగభాగం పెంపుడు శునకానికి, మిగతా సగం తన రెండో భార్య చంపా బాయ్కు రాసిచ్చాడు. ‘నా భార్య చంపా బాయ్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది.. లాగే నా పెంపుడు శునకం జాకీ కూడా ఎంతో బాగా చూసుకుంటోంది.. అందుకే నా ఆస్తి మొత్తాన్ని వీరిద్దరి పేరున రాస్తున్నాను. నా మరణానంతరం నా ఆస్తి అంతా వీరికే చెందుతుంది. ఈ ఇద్దరే తనను చివరి వరకు బాగా చూసుకుంటారని నమ్మకం ఉంది.. నేను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కూడా వీరే నిర్వహించాలి.. అంతేకాదు జాకీని ఎవరైతే చూసుకుంటారో దాని పేరున ఉన్న ఆస్తికి వారే వారసులు అవుతారు’ అని నారాయణ వర్మ తన వీలునామాలో పేర్కొన్నాడు. మొత్తం 21 ఎకరాల భూమి సహా మిగతా ఆస్తులను సరిసమానంగా వీలునామా రాశాడు. ‘నా చిన్నతనం నుంచీ కుక్కలను ప్రేమించాను.. గతంలో నా పెంపు కుక్క చనిపోయిన తరువాత జాకీని నా అల్లుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాను.. ఇంట్లో గొడవ జరగడంతో నా మరణం తరువాత జాకీని పట్టించుకోరని భావించి వీలునామా ఆలోచన వచ్చింది. వీలునామపై నా కొడుకు కలత చెందాడు.. ఈ విషయం గ్రామ సర్పంచ్‌‌కు తెలియజేయడంతో ఆయన నా దగ్గరకు వచ్చి వీలునామాను రద్దు చేయమని కోరాడు. వీలునామా ఇంకా రద్దు చేయకపోయినా ఈ సమస్య కుటుంబంలోనే చర్చించి పరిష్కరించాం’ అని వర్మ తెలిపాడు. దీనిపై గ్రామ సర్పంచ్ జమున ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. ‘నేను పంచాయతీలోని మరికొందరు సభ్యులతో కలిసి వర్మ ఇంటికి వెళ్లి, అలాంటి సంకల్పానికి విలువ లేదని, అది ఖచ్చితంగా కుటుంబంలో స్పర్ధలకు కారణమవుతుందని చెప్పడానికి ప్రయత్నించాను.. కుమారుడిపై ఆగ్రహంతో వీలునామా రాసి, నోటరీ చేయించాడడు. వీలునామాను రద్దు చేస్తానని ఆయన నాకు హామీ ఇచ్చాడు’ అని వ్యాఖ్యానించారు.


By December 31, 2020 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmer-declares-dog-legal-heir-in-will-along-with-wife-in-madhya-pradesh/articleshow/80039306.cms

No comments