Breaking News

పెళ్లికి ఒప్పకోలేదని ప్రియురాలి తండ్రిని హత్యచేసిన యువకుడు


తమ పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలి తండ్రిని యువకుడు హత్యచేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీ సోనియా విహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనియా విహార్‌కు చెందిన నిందితుడు సూరజ్ కుమార్ (25) పాలం మెట్రో స్టేషన్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి, సూరజ్ కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి బిజేందర్ సింగ్.. తన కుమార్తెను మందలించారు. ప్రేమ వ్యవహారానికి ముగింపు పలకాలని తండ్రి హెచ్చరించినా.. యువతి మాత్రం సూరజ్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమెను ఉత్తర్‌ ప్రదేశ్‌‌లోని తమ స్వస్థలం మొరదాబాద్‌కు పంపించేశారు. కుమారుడి ప్రేమను అంగీకరించిన సూరజ్ తల్లిదండ్రులను యువతి కుటుంబాన్ని కలిసి వివాహ ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ, వారి ప్రతిపాదనను బిజేందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించడంతో సూరజ్‌ ఆందోళనకు గురయ్యాడు. తమ ప్రేమను కాదన్నందుకు తీవ్రంగా ఆగ్రహించిన సూరజ్.. బిజేందర్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో శనివారం ఉదయం ప్రియురాలి ఇంటికి వెళ్లి గొడవపడి.. కిచెన్‌లో కత్తి తీసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. అనంతరం ప్రెజర్ కుక్కర్‌ తీసుకుని తలపై పలుసార్లు బలంగా కొట్టడంతో బిజేందర్ చనిపోయాడని ఈశాన్య ఢిల్లీ డీసీపీ వెల్లడించారు. హత్యజరిగిన తర్వాత అక్కడ నుంచి సూరజ్ పరారయ్యాడని, బాధితుడి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామన్నారు. అతడిని ఉత్తర ఢిల్లీలో సోమవారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు.


By December 08, 2020 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/youth-kills-girlfriends-father-for-refusing-his-marriage-proposal-in-delhi/articleshow/79619284.cms

No comments