Breaking News

ఏసీబీకి చిక్కిన అవినీత చేప.. పొల్యూషన్ బోర్డ్ అధికారి ఇంట్లో వందల కోట్ల ఆస్తులు!


అవినీతికి అలవాటు పడిన అధికారులు అడ్డదారులు తొక్కుతూ కోట్లాది రూపాయాలు కూడబెట్టుకుంటున్నారు. అవినీతి చేపల ఆటకట్టించడానికి ఏసీబీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నా ఏ మాత్రం భయపడటం లేదు. వీరి అక్రమాలకు అడ్డుఅదుపే లేకుండా పోతోంది. తాజాగా, మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి నివాసంపై ఏసీబీ జరిపిన దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. కిలోల కొద్దీ బంగారం, వెండి, నోట్ల కట్టలు చూసి అధికారులు అవాక్కయ్యారు. చెన్నైలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి పాండ్యన్ నివాసంలో ఏసీబీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. పరిశ్రమలకు పొల్యూషన్ అనుమతులు ఇవ్వడానికి పలువురు నుంచి పాండ్యన్ భారీగా నగదు తీసుకున్నట్టు సమాచారం అందడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. సైదాపేట్‌లోని పాండ్యన్ ఇంట్లో దాడులు చేసిన అధికారులు.. లెక్కలు చూపని నగదు, బంగారం, ఆస్తులను భారీగా గుర్తించారు. విలువైన వజ్రాలు, మూడు కిలోల బంగారం, మూడున్నర కిలోల వెండి అభరణాలతోపాటు రూ.1.37 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. వీటితోపాటు మొత్తం 18 చోట్ల రూ.50 కోట్ల విలువైన స్థిర ఆస్తులున్నట్టు పత్రాలు బయటపడ్డాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాండ్యన్ నివాసంలో లభ్యమైన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు.. కేసు నమోదుచేశారు. పాండ్యన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాకర్‌ కీ, పలు భూపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల విలువ రూ.వందల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. భూవివాద సెటిల్‌మెంట్‌కు రూ.కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ తెలంగాణలో కీసర తాసిల్దార్‌ నాగరాజు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.


By December 16, 2020 at 12:30PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/acb-raids-pollution-control-board-officers-home-heavy-property-identification/articleshow/79754519.cms

No comments