Breaking News

కేరళలో మరో కొత్త వ్యాధి.. సూడాన్ నుంచి వచ్చిన సైనికుడిలో గుర్తింపు


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న వేళ.. కేరళలో కొత్తరకం మలేరియా జన్యువును గుర్తించారు. అనే కొత్తరకం పరాన్నజీవిని గుర్తించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ గురువారం ప్రకటించారు. సుడాన్ నుంచి వచ్చిన ఓ సైనికుడిలో దీనిని గుర్తించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి కన్నూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలిపారు. ‘ప్లాస్మోడియం ఒవాలే.. మలేరియాకు చెందిన కొత్త పరాన్నజీవిని రాష్ట్రంలో గుర్తించాం.. ఓ సైనికుడిలో ఈ జన్యువును గుర్తించాం.. కన్నూరు జిల్లా ఆస్పత్రిలో అతడికి చికిత్స అందజేస్తున్నాం.. ఆయన ఇటీవలే సూడాన్ నుంచి వచ్చారు’ అని ఆరోగ్య మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో చికిత్స, నివారణ చర్యలతో వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని మంత్రి అన్నారు. అంతేకాదు, ఈ పరాన్నజీవి ప్రాణాంతకమని ఇంత వరకు ఎటువంటి ఆధారాలేవన్నారు. మలేరియాకు కారణమైన ప్రోటోజోవాను ఐదు రకాలుగా పేర్కొంటారు. ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం నోలెసి, ప్లాస్మోడియం ఓవాలే. వీటిలో, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం దేశంలో సర్వసాధారణం. ప్లాస్మోడియం ఒవాలే సాధారణంగా ఆఫ్రికాలో కనిపిస్తుంది. దేశంలో తొలిసారిగా కరోనా వైరస్‌ను కేరళలోనే గుర్తించిన విషయం తెలిసిందే. వుహాన్ యూనివర్సిటీలో చదువుకునే కేరళ విద్యార్ధి.. చైనా నుంచి స్వదేశానికి చేరిన తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ విద్యార్థికి జనవరి 30న కోవిడ్ నిర్ధారణ కావడంతో త్రిసూర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. ఇక, 2018లో నిఫా వైరస్ కూడా కేరళలోనే వెలుగుచూసింది.


By December 11, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-genus-of-malaria-plasmodium-ovale-detected-solider-in-kerala/articleshow/79674883.cms

No comments