Breaking News

ప్రపంచ మానవహక్కుల దినోత్సవం.. ఐరాస డిక్లరేషన్ ఏం చెబుతోంది?


మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని మానవహక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో ‘బాగా కోలుకోండి.. మానవహక్కుల కోసం నిలబడండి’ అనే నినాదంతో జరుపుకుంటున్నారు. మానవ హక్కుల సార్వత్రిక తీర్మానాన్ని సాధారణ సభ 1948 డిసెంబరు 10న ఆమోదించింది. ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’పై అన్ని సభ్య దేశాలను, సంస్థలను ఆహ్వానించి జనరల్ అసెంబ్లీ 423(ఐ) తీర్మానం ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి అన్ని దేశాలూ డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం పాటించడం ఆనవాయితీగా మారింది. 1993లో మానవ హక్కుల అభివృద్ధి, పరిరక్షణ కోసం ఒక హైకమిషనర్‌ను ఐరాస నియమించింది. మానవ హక్కులు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు సంబంధించిన అంశమే కాదు.. అనేవి సార్వత్రిక, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్యసమితి, లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993లో ఆమోదించారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1993 అక్టోబర్ 12న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కానీ దీనికి రాజ్యాంగబద్ధతలేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడుతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కూడా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించివేస్తోంది. పరువుహత్య, జాతి వివక్ష హత్య, అత్యాచార ఘటనలు.. ఇలా అనేకరకాల వార్తలు మనం చూస్తునే ఉన్నారు. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాఢ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘసంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పిచేందుకు 1948 డిసెంబర్‌న ఐక్యరాజ్యసమితి ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ చేసింది. ఈ ప్రకటన ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలి. జాతి, మత, రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ప్రజలు ఇబ్బందులకు గురి కారాదు. మానవహక్కుల ప్రధాన లక్ష్యాలు... 1. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. 2. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడడం. 3. వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం. 4. నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. 5. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి. 6. సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు ఉండాలి. 7. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. 8. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. 9. భావప్రకటన, స్వాతంత్య్రపు హక్కు ఉండాలి. 10. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి.


By December 10, 2020 at 10:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/history-and-importance-of-human-rights-day-all-about-theme/articleshow/79655957.cms

No comments