Breaking News

యూకే నుంచి వచ్చినవారికి కరోనా.. నాలుగేళ్ల పాపకు పాజిటివ్, తల్లిదండ్రులకు మాత్రం..


యూకేలో గుర్తించిన కొత్తరకం కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ స్ట్రెయిన్ 70 శాతం మరింత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు వెల్లడికావడంతో 50 దేశాలు బ్రిటన్‌పై తాత్కాలికంగా ప్రయాణాలను నిషేధించాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఒకటి. ఇదిలా ఉండగా.. యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన పలువురికి కోవిడ్‌ నిర్ధారణ కావడంతో వారిని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా భువనేశ్వర్‌లో బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన నాలుగేళ్ల చిన్నారికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. అయితే వారి తల్లిదండ్రులిద్దరికీ నెగెటివ్‌ రావడం గమనార్హం. ఆ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి డిసెంబరు 18న లండన్ నుంచి భువనేశ్వర్‌‌కు చేరుకుంది. అయితే బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన ఒడిశా అధికార యంత్రాంగం అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ చిన్నారి కుటుంబసభ్యులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాపకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె తల్లిదండ్రులకు నెగెటివ్‌గా తేలడంతో వీరిని సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచారు. అయితే చిన్నారికి సోకింది కొత్త స్ట్రెయినా? కాదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. చిన్నారి రక్త నమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అలాగే, బాలిక తల్లిదండ్రులకు శనివారం మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల యూకే నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా కొవిడ్‌ నిర్ధారణ కావడంతో అతడి రక్తనమూనాలను నేషనల్‌ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌‌కి పంపినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. డిసెంబరు 7-23 మధ్య ఒడిశాకు బ్రిటన్ నుంచి 62 మంది వచ్చారు. డిసెంబరు 23 నుంచి యూకే విమానాల రాకపోకలను తాత్కలికంగా రద్దు చేయగా.. అంతకు ముందే భారత్‌కు చేరుకున్నవారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచారు. మరోవైపు కొత్త రకంపై రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. గత రెండువారాల్లో యూకే నుంచి వచ్చిన, యూకే మీదుగా ప్రయాణాలు చేసిన వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.


By December 26, 2020 at 12:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-years-old-girl-uk-returnee-tests-positive-for-coronavirus-in-odisha/articleshow/79964334.cms

No comments