Breaking News

ఈ నెలలోనే ఆకాశంలో అత్యంత అద్భుతం.. 397 ఏళ్ల తర్వాత.. ఏ రోజునంటే?


ఈ ఏడాది ఖగోళ అద్భుతాల పరంపర కొనసాగుతోంది. దాదాపు నాలుగు శతాబ్దాల తర్వాత ఆకాశంలో జరిగే అద్భుతానికి 2020 ఏడాది సాక్షీభూతంగా నిలవనుంది. డిసెంబరు 21న అతి సమీపంగా వచ్చి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. క్రీ.శ.1623 తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో ఈ అరుదైన దృశ్యం కోసం ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తోంది. భూమి నుంచి చూస్తే ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా సమీపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా పిలుస్తారు. ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం గ్రేట్‌ కంజక్షన్‌గా అభివర్ణిస్తారు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు నిత్యం కొంత దగ్గరగా వస్తున్నాయి. భూమిపై నుంచి చూస్తోన్న మనకు సాయంత్రం వేళ ఇవి స్పష్టంగానే కనిపిస్తాయి. అయితే, డిసెంబర్‌ 21న మాత్రం అత్యంత సమీపానికి వచ్చినట్లు దర్శనమిస్తాయి. అప్పుడు వీటి మధ్య దూరం దాదాపు 73.5కోట్ల కిలోమీటర్ల ఉంటుందని శాస్త్రవేత్తల భావిస్తున్నారు. గురు-శని గ్రహాలు 1623 తర్వాత ఎప్పుడూ సమీపానికి రాలేదని, 397 సంవత్సరాల తర్వాత డిసెంబరు 21న రానున్నాయని బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేవీ ప్రసాద్ దురై ఓ ప్రకటనలో తెలిపారు. అంతకు ముందు మధ్య యుగంలో 1226 సంవత్సరంలో ఇలాగే వచ్చాయన్నారు. భూమిపై నుంచి చూసినప్పుడు ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా సమీపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా పిలుస్తామని, ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని అంత్యంత సమీపంగా రావడాన్ని గ్రేట్‌ కంజక్షన్‌గా భావిస్తామని అన్నారు. ఇలా మళ్లీ 2080 మార్చి 15న సమీపానికి వస్తాయని తెలిపారు. ప్రతి నెల చంద్రుడు (భూమికి ఉపగ్రహం)-అంగారకుడు; చంద్రుడు-గురు; చంద్రుడు-శని సహా ఇతర గ్రహాలు దగ్గరగా ఉన్నట్టు కనిపించడం సర్వసాధారణం. చంద్రుడు కాకుండా మిగతా గ్రహాలు కూడా ఒక్కోసారి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. ఇందులో భాగంగానే మనకు గతకొద్ది కాలంగా గురు-శని గ్రహాలు దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తుండగా.. డిసెంబర్‌ 21 నాటికి మరింత దగ్గరగా చేరి మనకు ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని అన్ని ప్రాంతాల నుంచి డిసెంబరు 21న సాయంత్రం 5.28 నుంచి 7.12 మధ్య ఈ దృశ్యాన్ని చూడవచ్చు. భూమికి చంద్రుడికి మధ్య దూరం దాదాపు 3,84,000 కిలోమీటర్లు కాగా.. ఇతర గ్రహాలు లక్షలు, కోట్ల కి.మీ దూరంలో ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఇలా తిరిగే సమయంలో ఏవేని రెండు గ్రహాలు ఒక్కోసారి కొంత దగ్గరగా చేరుకుంటాయి. అయినప్పటికీ వాటిమధ్య లక్షల కి.మీ దూరం ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365రోజులు పడితే, గురు గ్రహానికి 12 ఏళ్లు, శనికి మాత్రం దాదాపు 28-30 ఏళ్లు పడుతుంది. భారత్‌లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించవచ్చు.


By December 07, 2020 at 07:00AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/jupiter-saturn-spectacle-on-december-21-set-to-wow-stargazers-after-397-years/articleshow/79599883.cms

No comments