Breaking News

రూ.200 పెట్టి స్థలం లీజ్‌కు తీసుకున్న రైతు.. నెల రోజుల్లోనే రూ.60 లక్షలు లాభం


మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతుకు జాక్‌పాట్ తగిలింది. నెల రోజుల క్రితం రూ.200తో ఓ స్థలం లీజ్‌కు తీసుకుంటే.. రూ.60 లక్షలకుపైగా లాభం వచ్చింది. ఒక్క రోజులోనే ఆ రైతు మిలియనీర్ అయిపోయాడు. ఎలా అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవండి. మధ్యప్రదేశ్‌‌లో పన్నా ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి. ఎవరైనా సరే ఇక్కడ కొంత స్థలాన్ని లీజ్‌కు తీసుకొని.. వజ్రాల కోసం అన్వేషణ సాగించొచ్చు. దీంతో తమకు వజ్రం దొరుకుతుందనే ఆశతో చాలా మంది ఇక్కడి నేలను తవ్వి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. 45 ఏళ్ల లఖన్ యాదవ్ నెల రోజుల క్రితం రూ. 200 చెల్లించి 10x10 అడుగుల విస్తీర్ణంలో ఓ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నాడు. ఆ స్థలంలో తవ్వగా 14.98 క్యారెట్ల వజ్రం దొరికింది. దాన్ని శనివారం వేలం వేయగా రూ.60.6 లక్షలు వచ్చాయి. తాను చదువుకోలేదని.. వచ్చిన డబ్బును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. తన నలుగురు పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని యాదవ్ తెలిపాడు. పన్నా నేషనల్ పార్క్ కోసం ఖాళీ చేయించిన గ్రామాల్లో లఖన్ యాదవ్ ఊరు కూడా ఉంది. గ్రామాన్ని వదిలి వెళ్లినందుకు పరిహారంగా ఇచ్చిన డబ్బుతో రెండు హెక్టార్ల స్థలం కొనుగోలు చేశాడు. వజ్రాన్ని డిపాజిట్ చేయగానే అధికారులు రూ. 2 లక్షలు అతడికి ఇచ్చారు. మేనల్లుడి బలవంతం మీద ఆ మొత్తంతో ఓ బైక్ కొనుగోలు చేశాడు. కానీ తనకు సైకిలే సౌకర్యవంతంగా ఉంటుందని యాదవ్ చెప్పడం గమనార్హం. ఓసారి వజ్రం దొరకడంతో జాతకం మారిపోయిన లఖన్ యాదవ్.. మరోసారి వజ్రాల వేటకు వస్తానని.. మళ్లీ తనకు వజ్రం దొరుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.


By December 07, 2020 at 09:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-farmer-finds-rs-60-lakh-diamond-in-small-portion-of-land-he-leased-for-rs-200/articleshow/79601412.cms

No comments