Breaking News

నేడే బిహార్ ఎన్నికల ఫలితాలు.. నితీశ్ హ్యాట్రిక్ కొడతారా.. తేజస్వీదే విజయమా?


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికలు కావడంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకుంది. వరుసగా నాలుగోసారి విజయం సాధిస్తారా? ఆర్జేడీ నాయకత్వంలోని మహాకూటమిని విజయాన్ని వరించనుందా మరి కొన్ని గంటల్లో తెలిపోనుంది. ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనుండగా.. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహా కూటమి విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. ఈసారి బిహార్ పగ్గాలు యువ నాయకత్వం చేతికి వెళ్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయడంతో తుది ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తిగా గమనిస్తున్నారు. గత 15ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న నితీశ్ ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తించాయి. మహాకూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌లు సైతం ఈ ఎన్నికలు ఓ జీవన్మరణ పోరాటంగానే భావించాయి. అధికారానికి దూరమై 15 ఏళ్లు కావడం, దాణా కుంభకోణం కేసులో లాలూ జైల్లో ఉండటంతో తేజస్వీ ఒంటరి పోరాటం చేశారు. ఆయన ప్రచారానికి ప్రజలు పోటెత్తినా.. ఏమేరకు ఓట్ల రూపంలో లబ్ది పొందారనేది తేలిపోనుంది. మొత్తం 243 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సవాలుగా మారినా తగిన జాగ్రత్తలు చేపట్టింది. మొత్తం 38 జిల్లాల్లోని 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగనుండగా.. భారీ భద్రత ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఆయా పార్టీల సభ్యులు గుమిగూడకుండా చూసుకోవడం ఇప్పుడు ఈసీ ముందున్న అతిపెద్ద సవాల్. బిహార్‌తోపాటు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ భవిత్యాన్ని తేల్చే ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడుతున్నాయి. ఈ రెండింటితో పాటు 11 రాష్ట్రాల్లో 58 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మహాకూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ప్రత్యర్థులు ఏదైనా కుట్రకు పాల్పడే అవకాశం ఉందని, స్ట్రాంగ్‌ రూంలపై కన్నువేసి ఉంచాలని కాంగ్రెస్‌ పార్టీ తమ నేతల్ని ఆదేశించింది. ఇందుకోసం రణదీప్‌ సూర్జేవాలా, అవినాశ్‌ పాండే వంటి సీనియర్‌ నేతల్ని పట్నాకు పంపింది. ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురికాకుండా ఇలాంటి ఏర్పాట్లు చేశారన్న ప్రచారాన్ని పార్టీ అధికార ప్రతినిధులు తోసిపుచ్చారు.


By November 10, 2020 at 06:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-elections-2020-counting-of-votes-for-bihar-assembly-polls-to-take-place-today/articleshow/79140543.cms

No comments