Breaking News

ఆడియో టేపుల వ్యవహారం.. లాలూపై పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు


బిహార్‌లో ఆడియో టేపుల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్‌కు లాలూ ఫోన్ చేసి, స్పీకర్ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయాలని కోరినట్టు మాజీ డిప్యూటీ సీఎం ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఎన్నికలకు దూరంగా ఉంటే తనకు మంత్రి పదవి ఇస్తానని ఆశపెట్టారని అందులో ఆరోపించారు. లాలన్‌ను మహాకూటమిలో చేరాలని లాలూ సలహా ఇచ్చినట్టు సుశీల్ మోదీ గురువారం ఆరోపించారు. లాలూ ఫోన్ చేసిన విషయాన్ని లాలన్ నాతో చెప్పారు.. అదే నెంబర్‌కు నేను ఫోన్ చేస్తే ఇర్ఫాన్ అనే వ్యక్తి మాట్లాడాడు.. ఫోన్‌ లాలూకు ఇవ్వాలని చెప్పాను.. నేను ఫోన్ చేయడంతో లాలూ ఆశ్చర్యపోయారు... ఇలాంటి అనైతిక విధానాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశాను.. డిప్యూటీ సీఎం పదవి నుంచి నన్ను తొలగించినందున ఆర్జేడీలో చేరాలని సూచించారు... నేను బీజేపీకి విధేయుడ్నినని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని బదులిచ్చాను’ అని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సుశీల్ మోదీ బిహార్ శాసనమండలిలో ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. జైళ్లో ఉన్నా లాలూ రాజకీయాలు కొనసాగిస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. పోలీసులకు ఫిర్యాదుచేసిన తర్వాత లాలన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ ఎమ్మెల్యేను ప్రలోభానికి గురిచేయడం చట్టవిరుద్ధం.. ఇటువంటి చర్యలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తాయి.. దీనికి పర్యవసానంగా, లాలూపై విజిలెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకున్నాను’అని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జీతన్ రాం మాంఝీ, మంత్రి ముఖేశ్ సాహ్నీలు లాలూ తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని గురువారం ఆరోపించారు. ‘మంగళవారం అర్ధరాత్రి వరకు తనకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయని, లాలూ మీతో మాట్లాడతారని అవతలి వ్యక్తి చెప్పినా.. నేను నిరాకరించాను.. ఒకవేళ లాలన్, సుశీల్ మోదీ చేసిన ఆరోపణలు 200 శాతం నిజమైనవి.. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా లాలూ తనతోపాటు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించారు’ అని మాంఝీ పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఆర్జేడీ నేతలు తోసిపుచ్చారు. దీనిపై పోలీసులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆడియో క్లిప్పింగుల్లో వాయిస్ లాలూది కాదని, దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని ఆర్జేడీ ఉపాధ్యాక్షుడు శివానంద్ తివారీ అన్నారు.


By November 27, 2020 at 11:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-mla-files-plaint-against-lalu-for-trying-to-lure-him/articleshow/79441368.cms

No comments