Breaking News

ఆమె మేజర్.. కోరుకున్నవాడితో జీవించే హక్కు ఉంది: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు


ఓ మేజర్ మహిళ తను కోరుకున్నవాడితో ఎక్కడైనా జీవించే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. 20 ఏళ్ల యువతి తన భర్తతో జీవించడానికి అనుమతిస్తూ జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రజినీశ్ భట్నాగర్‌ల ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాలను తీసుకురావడంతో నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పును వెలువరించడం విశేషం. సులేఖ అనే యువతి తన భర్త బబ్లూతో కలిసి ఉండటానికి ధర్మాసనం అనుమతించింది. మైనర్ అయిన తమ కుమార్తెను అపహరించారని ఆమె కుటుంబం చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సులేఖను విచారించిన ధర్మాసనం.. ఆమె మేజర్ అని గుర్తించింది. తన ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పడంతో బబ్లూ నివాసం వద్ద భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్, సులేఖ తల్లిదండ్రులకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని లేదా జంటను బెదిరించవద్దని సలహా ఇవ్వాలని పోలీసులకు సూచించింది. సులేఖ సోదరి హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో అత్యవసర విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈమేరకు తీర్పు చెప్పింది. వివాహాల్లో హిందూ, ముస్లిం అనే తేడాలను కోర్టు చూడదని.. వారు మేజర్లా కాదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని ఇటీవల యూపీకి చెందిన సలామత్-అలియా కేసులో అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మేజర్లకు తమ జీవితభాగస్వాములను ఎంపిక‌‌‌‌‌ చేసుకునే హక్కు ఉంటుందని, వారి స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని హైకోర్టు తెలిపింది. ఇది భిన్నత్వంలో ఏకత్వమన్న భావనకే విరుద్ధమని తీర్పు చెప్పింది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాల్లో చొరబడటం అనేది వారి ఎంపిక స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని వ్యాఖ్యానించింది. తాజాగా సులేఖా కేసులోనూ ఢిల్లీ హైకోర్టు అటువంటి తీర్పునే వెలువరించింది. ఆమె మేజర్ అని, ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుత నివేదిక ప్రకారం.. 2000 సంవత్సరంలో జన్మించిన సులేఖ.. ఇంటి నుంచి వెళ్లిపోయే నాటికి మేజర్.. తన ఇష్టపూర్వకంగానే బబ్లూ వెంట వెళ్లి వివాహం చేసుకుంది’ అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో అవసరమైతే సమీపంలోని పోలీస్ స్టేషన్ అధికారి మొబైల్ నెంబర్‌ను ఆ జంటకు ఇవ్వాలని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 12న సులేఖ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో బబ్లూ కిడ్నాప్ చేసుంటాడని ఆమె కుటుంబం అనుమానించింది.


By November 26, 2020 at 08:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/adult-woman-free-to-live-wherever-with-whoever-she-wishes-says-delhi-hc/articleshow/79419894.cms

No comments