Breaking News

వచ్చే ఏడాది ఏప్రిల్‌కి దేశంలో ఆక్స్‌ఫర్డ్ టీకా.. రెండు డోస్‌ల ధర ఎంతంటే?


భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సాధారణ ప్రజానీకానికి ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ గురువారం స్పష్టం చేసింది. ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు మాత్రం ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుందని, రెండు డోస్‌ల ధర సుమారు రూ.1,000గా ఉంటుందని అన్నారు. అయితే, తుది దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు, రెగ్యులేటరీ ఆమోదంపైనే ఇది ఆధారపడి ఉంటుందని పూనావాలా స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ 2024కి సాధ్యమవుతుందని హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఈ మేరకు అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఒక్క భారతీయుడికి వ్యాక్సినేషన్‌కు రెండు లేదా మూడేళ్లు పడుతుంది.. ఎందుకంటే కేవలం సరఫరా అడ్డంకులే కాదు.. అవసరమైన బడ్జెట్, టీకా, రవాణా, మౌలికవసతులతోపాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకురావడం.. కాబట్టి జనాభాలో 80-90 శాతం మందికి వ్యాక్సినేషన్‌కు ఇవి కారకాలు’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ రెండు డోస్‌లను వేయించుకోడానికి అందరూ అంగీకరిస్తే 2024కి దేశంలో అందరికి వ్యాక్సిన్ సాధ్యమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర 5-6 డాలర్లు అంటే మన కరెన్సీలో రెండు డోస్‌లు రూ.1,000 వరకు ఉంటాయని తెలిపారు. ‘భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం టీకా డోస్‌లను కొనుగోలు చేస్తే 3-4 డాలర్లకే వస్తుంది.. ఈ రోజు మార్కెట్‌లో మిగతా అన్ని టీకాల కంటే తమ వ్యాక్సిన్ ధరలు తక్కువగా ఉంటున్నాయి’అని పూనావాలా అన్నారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా వృద్ధుల్లోనూ సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపణ అయ్యిందని వ్యాక్సిన్ సమర్ధతపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘ఇది ఆరోగ్యకరమైన టి-కణాల ప్రతిస్పందనను ప్రేరేపించింది.. ఇది దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి, యాంటీబాడీ ప్రతిస్పందనకు సూచిక. అయితే ఈ టీకాలు మనల్ని దీర్ఘకాలికంగా రక్షించబోతున్నాయో లేదో వేచిచూడాలి... ప్రస్తుతం ఈ టీకా దీర్ఘకాలిక రక్షణపై ఎవరూ సమాధానం చెప్పలేరు’ అన్నారు. ఇప్పటి వరకు టీకా ప్రయోగాల్లో పాల్గొన్న వాలంటీర్లకు పెద్దగా దుష్ర్పభావాలు తలెత్తలేదన్నారు. ఈ విషయంలో వేచి చూడాలి.. భారత్‌లో ట్రయల్స్ సమర్థత,ఇమ్యునోజెనిసిటీ ఫలితాలు సుమారు నెలన్నర రోజుల్లో వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా ప్రయోగాలు భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అత్యవసర వినయోగానికి ఎప్పుడు దరఖాస్తు చేస్తారని ప్రశ్నించగా.. యూకే, ఐరోపా మెడిసిన్స్ ఇవెల్యూషన్ ఏజెన్సీల నుంచి టీకాకు ఆమోదం లభించిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. కానీ, ఫ్రంట్‌‌లైన్ వర్కర్లు, వైద్యఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు పరిమిత సంఖ్యలో ఉపయోగిస్తామని తెలిపారు.


By November 20, 2020 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-could-get-oxford-covid-vaccine-by-april-2021-says-serum-institute-ceo-adar-poonawalla/articleshow/79314873.cms

No comments