Breaking News

BJPని రెండుసార్లు దెబ్బకొట్టిన అహ్మద్ పటేల్.. అమిత్ షా చక్రవ్యూహాన్ని చేధించిన నేత!


కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత నేడు (నవంబర్ 25, 2020న) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. కీలక అవయవాలు విఫలం కావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన అహ్మద్ పటేల్.. సోనియా గాంధీకి కళ్లు, చెవుల్లాంటి వాడని చెబుతుంటారు. ఆయనేం చెప్పినా సోనియా నమ్మేవారు. తన పొలిటికల్ సెక్రటరీ అహ్మద్ అంటే ఆమెకు అంత గురి. 1949లో గుజరాత్‌లో భరుచ్‌లో జన్మించిన అహ్మద్ పటేల్.. 1976లో రాజకీయాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటులా మారారు. రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా.. తర్వాత సోనియాకు పొలిటికల్ సెక్రటరీగా వ్యవహరించారు. 1977లో ఇందిరా గాంధీ ప్రోత్సాహంతో లోక్ సభకు ఎన్నికైన అహ్మద్ పటేల్.. 1980, 1984లోనూ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎషాన్ జాఫ్రీ తర్వాత గుజరాత్ నుంచి లోక్ సభకు ఎన్నికైన రెండో ముస్లిం నేత అహ్మద్ పటేల్ మాత్రమే. అహ్మద్ పటేల్ 1993 నుంచి వరుసగా ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. చివరిసారిగా ఆయన 2017లో ఎగువ సభకు ఎన్నికయ్యారు. ఆయన్ను ఓడించడం కోసం బీజేపీ అన్ని రకాలుగా వ్యూహాలు రచించింది. అపర చాణక్యుడిలా భావించే అమిత్ షా రంగంలోకి దిగినా సరే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి బీజేపీ అభ్యర్థికి ఓటేసినా... ఒక్క ఓటు తేడాతో అహ్మద్ పటేల్ గెలుపొందారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన భోలాభాయి గోహిల్, రాఘవ్‌జీ పటేల్ బీజేపీకి ఓటేశారు. దీంతో మీరెవరికి ఓటేశారో మీ బాస్‌కు చూపించండని పోలింగ్ బూత్‌లో ఉన్న కాంగ్రెస్ ఏజెంట్ శక్తిసింహ్ గోహిల్ వారిని రెచ్చగొట్టారు. వారిద్దరూ బీజేపీ ఏజెంట్‌కు తమ ఓటును చూపించారు. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వారి ఓట్లు మురిగిపోయాయి. చివరి నిమిషం వరకూ అమిత్ షా పక్కనే ఉన్న ఎన్సీపీ నేత చోటూ వాసవా తన తొలి ప్రాధాన్య ఓటును అహ్మద్ పటేల్‌కు వేశాడు. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు వాసవా కొడుకుపై కేసు నమోదు కాగా.. ఈ విషయంలో అహ్మద్ పటేల్ చోటూ వాసవాకు సహకరించారు. దీంతో ఆయన అహ్మద్ పటేల్‌కు ఓటేశారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అమిత్ షా రంగంలోకి దిగినా.. అహ్మద్ పటేల్ ఒక్క ఓటు తేడాతో గెలిచి ఐదోసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సమయంలో అహ్మద్ పటేల్ మరోసారి బీజేపీని దెబ్బకొట్టారు. శివసేనకు సీఎం పీఠం ఇచ్చేది లేదని బీజేపీ తేల్చి చెప్పడంతో.. ఆ పార్టీ ఎన్సీపీతో టచ్‌లోకి వచ్చింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిస్తే.. ప్రభుత్వం ఏర్పాటు చేయడం తేలికే. కానీ సోనియా గాంధీ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే వెళ్లి కలిసినా ఆమె వైఖరి మారలేదు. దీంతో చివరి ప్రయత్నంగా వారు అహ్మద్ పటేల్‌ను కలిశారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సోనియా అంగీకరించేలా అహ్మద్ పటేల్ ఆమెను ఒప్పించారు. బీజేపీని అధికారానికి దూరం చేయడంతోపాటు.. తమ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదనే సంకేతాలను ప్రజల్లోకి పంపడానికి ఈ కూటమి దోహదం చేస్తుందని ఆమెకు నచ్చజెప్పారు. అలా బీజేపీకి పాత మిత్రుల్లో ఒకటైన శివసేనను దూరం చేయడంతోపాటు.. మహారాష్ట్రలో ఆ పార్టీకి అధికారం దక్కకుండా అహ్మద్ పటేల్ వ్యవహరించారు.


By November 25, 2020 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ahmed-patel-managed-to-retain-rajya-sabha-seat-for-fifth-time-by-fighting-with-amit-shah-and-bjp/articleshow/79401407.cms

No comments