Breaking News

తీవ్రమవుతోన్న అర్మేనియా-అజర్ బైజాన్ యుద్ధం.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్


రెండు మత వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు, చిలికి చిలికి గాలివానలా మారినట్టు అజర్‌బైజాన్, అర్మేనియా దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. ఐదు రోజుల కిందట మొదలైన ఈ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు కలిగిన భారత్ స్పందించింది. రెండు దేశాలూ శాంతియుతంగా ఉండాలని సూచించింది. అజర్‌ బైజాన్, అర్మేనియా యుద్ధం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ.. ఈ ఉద్రిక్త పరిస్థితి శాంతికి విఘాతమని అభివర్ణించారు. ‘ఆసియాలో శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమించిన పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతుంది.. ఈ ప్రాంతంలో శాంతికి కట్టుబడివుంది. ఇరుదేశాలూ సంయమనం పాటించాలి. తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలి. సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాలి. సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చల ద్వారానే శాంతి సాకారమవుతుందని మేము బలంగానమ్ముతున్నాం’ అని వ్యాఖ్యానించారు. అర్మేనియాలోని క్రిస్టియన్, అజర్ బైజాన్‌లోని ముస్లిం వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు, రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసింది. ముఖ్యంగా నాగోర్నా- కరబఖ్ ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. పరిస్థితులను సద్దుమణిగేలా చేసి, శాంతిని నెలకొల్పేందుకు పలుదేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతం అజర్‌‌ బైజాన్‌‌కు చెందినదే అయినా ఆర్మేనియన్లదే ఇక్కడ ఆధిపత్యం. ఈ రెండు దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ముంబయి నుంచి ఇరాన్‌లోని చాబర్ వరకు ఉత్తర-దక్షిణ అంతర్జాతీయ రవాణా కారిడార్ అజర్‌బైజాన్ మీదుగా వెళ్తోంది. ఇది భారత్‌కు ఎంతో కీలకమైన మార్గం. ఇక, 2018లో నాటి విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ అజర్ బైజాన్‌లో పర్యటించారు. ఇక, 2019లో ప్రధాని నరేంద్ర మోదీ, అర్మేనియా ప్రధాని నికోల్ పషియాన్‌తో ఐరాస సాధారణ సభ వార్షిక సమావేశాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో తమ మద్దతు వారికేనని అర్మేనియా ప్రధాని ఐరాసలోనే ప్రకటించారు. కాగా, రాబోయే రోజుల్లో అర్మేనియా, అజర్‌ బైజాన్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చనుందని, ఎందుకంటే ఇందులో రష్యా జోక్యం చోసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అజర్‌ బైజాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అర్మేనియాకు రష్యా బాసటగా నిలవనుంది. ఈ నేపథ్యంలో టర్కీపై దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినా ఆశ్చర్యపడక్కర్లేదని పేర్కొంటున్నారు.


By October 02, 2020 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-voices-concern-and-calls-for-restraint-to-armenia-azerbaijan-war/articleshow/78442454.cms

No comments