Breaking News

రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగులను ఢీకొట్టిన రైలు.. ఇంజిన్‌ను సీజ్ చేసిన అటవీ అధికారులు


రెండు ఏనుగుల మృతికి కారణమైన రైలు ఇంజిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వారాల కిందట లుండింగ్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని రైలు పట్టాలపై ప్రమాదం సంభవించి ఓ ఆడ ఏనుగు, ఏడాది వయసున్న గున్న ఏనుగు మృతిచెందాయి. గున్న ఏనుగు మృతదేహాన్ని తన తల్లి నుంచి కిలోమీటరు దూరంలో అధికారులు గుర్తించారు. దీంతో రిజర్వ్ ఫారెస్ట్‌ నిబంధనలను ఉల్లంఘించి రైలు వేగంగా వెళ్లినట్టు గుర్తించామని స్థానిక అధికారులు తెలిపారు. అసోం అటవీ శాఖ అధికారులు రైలు ఇంజిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన ఈశాన్య సరిహద్దు రైల్వే.. దీనిపై విధానపరమైన నిర్ణయం అవసరమని పేర్కొంది. ‘ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు.. దీనిపై విధానపరమైన విచారణ అవసరం...కార్యాచరణకు అంతరాయం లేదు.. లోకోమోటివ్‌ ప్రస్తుతం వాడుకలో ఉంది’ అని ఈశాన్య సరిహద్దు రైల్వే తెలిపింది. సెప్టెంబరు 27న జరిగిన ప్రమాదంలో ఏనుగు మరణించగా.. మంగళవారం ఈ ఇంజిన్‌ను అసోం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘రైల్వే ప్రాజెక్టులకు సరుకులను తరలించడానికి ఈ రైలును వినియోగిస్తున్నారు.. అభయారణ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అత్యంత వేగంగా ప్రయాణించడంతో నియంత్రించకలేపోయారు’ అని అసోం అటవీ శాఖ మంత్రి పరిమళ్ శుక్లాబైద్యా అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల మృతదేహాలను గుర్తించారు.. పిల్ల ఏనుగును తన తల్లి మృతదేహం నుంచి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది’ అని ఆయన తెలిపారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేసినట్టు అసోం అటవీ శాఖ వెల్లడించింది. అటవీ అధికారుల బృందం బామునిమైదాన్ లోకోమోటివ్ షెడ్‌కు వెళ్లి ఇంజిన్‌ను స్వాధీనం చేసుకుందని తెలిపింది. ప్రమాదానికి కారణమైన లోకోమోటివ్ పైలట్, అతడి సహాయకుడిని సస్పెండ్ చేసినట్టు రైల్వే శాఖ పేర్కొంది. ‘అసోం అటవీ శాఖ మాకు సమాచారం ఇచ్చింది. ఇంజిన్‌ను పరిశీలించమని అభ్యర్థించి, దీనిని తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని మాకు లేఖ రాశారు. మేము సంస్థాగత విచారణ చేపట్టి రైలు వేగంగా ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించాం’అని ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రతినిధి సుభానన్ చందా చెప్పారు. ‘స్వాధీనం చేసుకున్న ఇంజిన్‌ను ప్రజా సేవలను కొనసాగించడం దృష్ట్యా తిరిగి అప్పగించాం... జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 12 కోట్లు చెల్లించడానికి రైల్వే శాఖ అంగీకరించింది’ అని అసోం అటవీ శాఖ తెలిపింది.


By October 22, 2020 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-elephant-dragged-on-tracks-for-1-km-in-lumding-reserve-forest-assam-seizes-train-engine/articleshow/78800921.cms

No comments