Breaking News

నవంబరు 9న జైలు నుంచి లాలూ.. ఆ మర్నాడే నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ వ్యంగ్యాస్త్రాలు


బిహార్ ఎన్నికల ప్రచారంలో లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం హిసౌలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వీ.. సీఎం నితీశ్‌ కుమార్‌ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి నవంబరు 9న జైలు నుంచి విడుదలవుతారని, ఆ మర్నాడే నితీశ్‌‌‌కు ఫేర్‌వెల్ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచీ జైల్లో ఉన్నారు. ఇటీవల ఆయనకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా మరో కేసులో బెయిల్ రాకపోవడంతో జైలు నుంచి విడుదల కాలేదు. ‘లాలూ జీ నవంబరు 9న విడుదలవుతారు.. ఇప్పటికే ఓ కేసులో బెయిల్ వచ్చింది.. మరో కేసులో బెయిల్ నవంబరు 9న మంజూరు అవుతుంది.. అదే రోజు తన పుట్టినరోజు.. ఆ మర్నాడు నితీశ్ జీకి వీడ్కోలు పలుకుదాం’ అంటూ తేజస్వీ వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీకి అక్టోబరు 28, నవంబరు 3, నవంబరు 7న మూడు విడతల్లో పోలింగ్ జరగనుండగా ఫలితాలు నవంబరు 10న వెలువడనున్నాయి. ఉద్యోగాల కల్పన, అవినీతి అంతం, కార్మికుల వలసలను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని తేజస్వీ దుయ్యబట్టారు. నితీశ్ జీ మీరు అలసిపోయారు, బిహార్‌ను ఇక పాలించలేరు అని మరోసారి ఎద్దేవా చేశారు. తీరప్రాంతం లేకపోవడం వల్లే బిహార్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న నితీశ్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ సమావేశంలో 10 లక్షల ఉద్యోగాలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పదిహేనేళ్లలో ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సౌకర్యాలు, పరిశ్రమలు ఏర్పాటుచేయలేనివారు మరో ఐదేళ్లూ అధికారం ఇచ్చినా ఏం చేయగలరని తేజస్వీ నిలదీశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. బిహార్ వచ్చిన ప్రధాని ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతారని ఊహించానని, కానీ ఆయన ఎక్కడా దాని ప్రస్తావన తీసుకురాలేదని మండిపడ్డారు.


By October 24, 2020 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-election-lalu-yadav-out-on-nov-9-nitish-kumars-farewell-next-day-says-tejashwi-yadav/articleshow/78840588.cms

No comments