Breaking News

ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోవడంలేదు.. ఐరాసలో శాంతి మంత్రం జపించిన చైనా అధినేత


భారత్ సరిహద్దుల్లో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు, అమెరికాతో జరుగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతి వచనాలు వల్లెవేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, ప్రచ్ఛన్న యుద్ధం, హాట్‌ వార్‌.. ఏదీ తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో రికార్డు చేసిన వీడియో సందేశంలో జిన్‌పింగ్ ఈ విషయాలను వెల్లడించారు. దేశాల మధ్య బేధాభిప్రాయాలు సహజమేనని, అయితే, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశమైన చైనా.. శాంతియుత, సహకార సంబంధ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. తాము ఎప్పటికీ విస్తరణ, ఆధిపత్యం, ప్రభావితం చేయాలని భావించడంలేదు. ప్రచ్ఛన్న యుద్ధం లేదా ఏ దేశంతోనైనా పోరాడాలనే ఉద్దేశం కూడా మాకు లేదు అని పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఉన్న విభేదాలను తగ్గించుకుంటామని, సంభాషణలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటామని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం ప్రారంభమైన ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో ఆయా దేశాల అధినేతలు వర్చువల్‌ విధానంలోనే పాల్గొన్నారు. తొలిరోజు జీ జిన్‌పింగ్ సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్స్‌నారో ప్రసంగించారు. కరోనా వైరస్ విషయంలో చైనా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో భారత్ సరిహద్దులు, దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే పొరుగు దేశాలతో వివాదాలను రెచ్చగొడుతూ కయ్యానికి కాలుదువ్వుతోందనే వాదన వినబడుతోంది. ఈనేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.


By September 23, 2020 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/we-have-no-intention-to-fight-a-war-hot-or-cold-says-china-president-xi-jinping-at-unga/articleshow/78267663.cms

No comments