భారత బలగాలు సరిహద్దు దాటాయి, కాల్పులు జరిపాయి: చైనా ఆరోపణ

భారత్, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తూర్పు లడఖ్ సెక్టార్లో ఇరు దేశాలు భారీగా బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి సమయంలో సరిహద్దుల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇటీవలే భారత బలగాలు చైనా సైన్యం దురాక్రమణను తిప్పికొట్టి పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. గాడ్ పావో పర్వత ప్రాంతంలో భారత బలగాలు అక్రమంగా నియంత్రణ రేఖ దాటి వచ్చాయని.. సోమవారం అర్ధరాత్రి చైనా ఆర్మీ ఆరోపించింది. సైనికపరంగా ఇవి తీవ్రంగా రెచ్చగొట్టడమే.. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు అని పీఎల్ఏ వెస్టర్న్ థియేటర్ కమాండర్ అధికార ప్రతినిధి ఝాంగ్ షుయ్లీ వ్యాఖ్యానించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా గస్తీ చేపట్టిన చైనీస్ బోర్డర్ గార్డులకు ముప్పు కలిగించేలా భారత బలగాలు కాల్పులు జరిపాయని.. దీంతో పరిస్థితిని అదుపులోకి తేవడం కోసం చైనీస్ బోర్డర్ గార్డులు ప్రతి చర్యకు దిగారని ఝాంగ్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే మాస్కోలో ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రుల మధ్య సమావేశం జరగ్గా.. రెండు రోజుల్లో విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరగనుండగా.. ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
By September 08, 2020 at 06:10AM
No comments