Breaking News

మెరుపు వేగంతో స్పందించి డ్రాగన్‌కు షాకిచ్చిన భారత్.. చైనా ఎత్తులకు పైఎత్తు!


తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారత్‌, చైనాల మధ్య తాజాగా మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టి, ఈ ప్రాంతంలో తన వ్యూహాన్ని సమూలంగా మార్చేసింది. లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ‘సరిహద్దు నిర్వహణ’ మాత్రమే చేపట్టే భారత్‌.. ఇప్పుడు ‘సరిహద్దు రక్షణ’కు నడుం బిగించింది. ఇందుకు అనుగుణంగా భారీగా సైన్యాన్ని మోహరించింది. కొన్నిచోట్ల బలగాల స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. చైనా ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా దీటుగా తిప్పికొట్టేలా పటిష్ఠ వ్యూహాన్ని సిద్ధం చేసింది. మరోవైపు, చైనా సైతం బలగాలను భారీగా తరలించడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే, పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకున్న భారత్‌.. అదే పట్టును కొనసాగిస్తోంది. ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌-4‌ను చైనా ఆక్రమించుకోగా.. ఆ ప్రాంతంలోని ఇతర పర్వత శిఖరాలను మెరుపు వేగంతో స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి పెంచింది. తద్వారా భవిష్యత్‌లో చర్చలు జరిపేటప్పుడు భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు తెలిపాయి. ఫింగర్‌-4 ప్రాంతంలో తిష్టవేసిన డ్రాగన్‌ అక్కడి నుంచి వైదొలగడానికి నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవాణే రెండు రోజుల పర్యటనకు గురువారం లడఖ్‌ చేరుకున్నారు. సరిహద్దు శిబిరాన్ని సందర్శించి బలగాలతో సమీక్షించిన ఆయనకు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సైనిక కమాండర్లు వివరించారు. అలాగే ఐఏఎఫ్ చీఫ్ ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా తూర్పు విభాగంలోని పలు కీలక వైమానిక స్థావరాలను బుధవారం సందర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలలోని ఎల్‌ఏసీ వెంబడి వాయుసేన పోరాట సన్నద్ధతపై సమీక్ష జరిపారు. మన వాయు సేన ఇప్పటికే తనవద్ద ఉన్న సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌-2000 తదితర అగ్రశ్రేణి యుద్ధవిమానాలు, అపాచీ, చినూక్‌ వంటి హెలికాప్టర్లను మోహరించింది. ఇరు దేశాలు వేలాది మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, హెవిట్జర్లను భారీగా మోహరించాయి. భారత్ మెరుపు వేగంతో స్పందించి, సైన్యాలను మోహరించి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ‌కి షాక్ ఇచ్చింది. చుషుల్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ప్రదేశాలలో అదనపు బలగాలను తరలించి తూర్పు లడఖ్‌లో పట్టుసాధించింది’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.


By September 04, 2020 at 06:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/army-iaf-chiefs-visit-forward-areas-as-china-moves-more-forces-near-eastern-ladakh/articleshow/77922326.cms

No comments