Breaking News

భారత అమ్ములపొదిలోకి గోల్డెన్ ఏరోస్.. వాయుసేనలోకి అధికారికంగా రఫేల్ విమానాలు


సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ.. ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు వైమానిక దళంలోకి అధికారికంగా చేరాయి. ఈ యుద్ధ విమానాల చేరికతో వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఫ్లొరెన్స్‌ పార్లీ పాల్గొన్నారు. వాయుసేనలో 17వ స్క్యాడ్రన్‌గా రఫేల్ విమానాలు చేరాయి. ఇవి 17వ స్క్యాడ్రన్ గోల్డెన్ ఆరోస్‌ ద్వారా సేవలను అందజేయనున్నాయి. తొలి దశలో జులై 29న ఫ్రాన్స్ నుంచి ఐదు రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులతోపాటు సీడీఎస్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే భదౌరియా, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అలాగే, వైమానిక దళం నిర్వహించిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. నాలుగేళ్ల కిందట రూ.56 వేల కోట్లతో ఫ్రాన్స్ నుంచి 36 రఫెల్ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాల తయారీ బాధ్యతను ఆ దేశానికి చెందిన డసో ఏవియేషన్‌ సంస్థ తీసుకుంది. తొలి విడతగా ఐదు విమానాలు భారత్‌కు ఫ్రాన్స్ అప్పగించగా.. జులై 29న పంజాబ్‌లోని అంబాలాకు ఇవి చేరుకున్నాయి. ఈ ఏడాది నవంబరులో మరో నాలుగు విమానాలను ఫ్రాన్స్ అందజేయనుంది. మొత్తం 36 విమానాలు వచ్చే ఏడాది చివరి నాటికి భారత్‌‌కు అప్పగించనున్నారు.


By September 10, 2020 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-air-force-formally-inducts-rafale-jets-in-its-fleet-at-ambala-airbase/articleshow/78032884.cms

No comments