Breaking News

చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఒడిశా కూలీలు మృతి


చత్తీస్‌గఢ్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. ఒడిశా నుంచి గుజరాత్‌లో సూరత్‌కు కూలీలతో వెళ్తోన్న బస్సు.. రాయ్‌పూర్ సమీపంలోని చెరిఖేడి వద్ద ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులోని కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒడిశాలోని గంజాం నుంచి 20 మంది కూలీలను సూరత్‌కు ఓ బస్సులో తీసుకెళ్తోన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బస్సు చెరిఖేడి వద్ద ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.


By September 05, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/at-least-seven-persons-killed-after-a-bus-collided-with-truck-chhattisgarh/articleshow/77943206.cms

No comments