‘అంకుల్ ప్రణబ్’తో జగన్ అనుబంధం.. మీ నాన్న గర్వపడతారంటూ ప్రశంసలు!

మాజీ రాష్ట్రపతి, భారతరత్న సోమవారం కన్నుమూశారు. ఆయన మరణం పట్ల దేశంలోని రాజకీయ నాయకులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసి.. కీలక మంత్రి పదవులను చక్కబెట్టిన ఆయనకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. ముఖ్యంగా సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. రాజశేఖర రెడ్డి తనయుడు.. కడప ఎంపీగా పని చేసిన జగన్తోనూ ఆయనకు సాన్నిహిత్యం ఉంది. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ప్రణబ్ను తీవ్రంగా కలచి వేసింది. వైఎస్ హఠాన్మరణం పట్ల ఆయన స్పందిస్తూ.. ‘నా సంతాప సభకు ఆయన వస్తారనుకున్నా’ అని వ్యాఖ్యానించారట. తనకంటే వయసులో చిన్నవాడైన వైఎస్ ఇలా ముందే చనిపోతారని అనుకోలేదనే ఉద్దేశంతో ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో ప్రణబ్ ముఖర్జీ.. సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నావని అధిష్టానం తరఫున ఆయన్ను హెచ్చరించారు. ఓదార్పు యాత్రను ఇప్పటికైనా మానుకుంటే.. వెనక్కి రావడానికి కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంటాయని సంకేతాలు పంపారు. వాస్తవానికి జగన్ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసుకోవడం ప్రణబ్కు ఇష్టం లేదని చెబుతారు. అదే విషయాన్ని పార్టీ పెద్దల దగ్గర కూడా ప్రస్తావించారని.. కానీ ఫలితం లేకపోయిందని చెబుతారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడే.. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ఎంపిక చేయగా.. ఎన్డీయే అభ్యర్థిగా సంగ్మాను బరిలోకి దింపింది. ప్రణబ్ను అంకుల్ అని పిలిచేంత చనువు జగన్కు ఉండేదని చెబుతారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కారణంగానే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రణబ్కు ఓటేసింది. రిమాండ్లో ఉన్న జగన్.. జైలు నుంచి ప్రత్యేక అనుమతితో వచ్చి మరీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు. ప్రణబ్ రాష్ట్రపతి అయ్యాక జగన్ అక్రమాస్తుల కేసు విషయమై.. రెండు కోట్ల మంది చేసిన సంతకాలతో విజయమ్మ ఢిల్లీ వెళ్లి ప్రణబ్ను కలిశారు. విభజన తీరును నిరసిస్తూ చంచల్గూడ జైలులో జగన్ చేపట్టిన నిరవధిక దీక్ష గురించి ప్రణబ్ ముఖర్జీ ఆరా తీశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో జగన్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు. ఈ సమయంలో రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్ను ఆయన పలుసార్లు కలిశారు. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని ఎంపీలతో కలిసి జగన్ రాష్ట్రపతి ప్రణబ్ను కలిశారు. తర్వాత ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయమై ఆయన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. 2019లో తొలి నాళ్లలో కేంద్రం ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా.. ప్రణబ్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అత్యున్నత పురస్కారం దక్కించుకోవడానికి ప్రణబ్ అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు. ప్రణబ్ను మంచి రాజనీతిజ్ఞుడిగా జగన్ కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవకు దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో జగన్ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా జగన్కు శుభాకాంక్షలు చెబుతూ ప్రణబ్ ట్వీట్ చేశారు. ‘తిరుగులేని విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. యువకుడివైన నీపై ఆంధ్రా ప్రజలు విశ్వాసం ఉంచారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నీదే. మీ నాన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రోజు గర్వపడతారు’ అంటూ ప్రణబ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలెవరూ జగన్కు శుభాకాంక్షలు చెప్పే సాహసం చేయలేకపోయినప్పటికీ.. రాష్ట్రపతిగా పని చేసిన ప్రణబ్ మాత్రం జగన్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు.
By September 01, 2020 at 08:21AM
No comments