Breaking News

మే ఆరంభం నాటికే దేశంలో 64 లక్షల కరోనా కేసులు: సీరోసర్వే అంచనా


జనవరి 30న భారత్‌లో తొలి కేసును గుర్తించగా... మార్చి 2 నుంచి దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ను కట్టడి చేయడం కోసం మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మార్చి 24న ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఏప్రిల్ 14న మోదీ ప్రకటించారు. ఆ తర్వాత మే 14 వరకు.. మళ్లీ మే 31 వరకు కేంద్రం లాక్‌డౌన్ పొడిగించింది. కరోనా కట్టడి కోసం.. వైద్య సదుపాయాల కల్పన కోసం లాక్‌డౌన్ పీరియడ్ ఉపయోగపడుతుందని కేంద్రం భావించింది. లాక్‌డౌన్ ఆంక్షల ఎత్తివేత ప్రారంభించాక.. కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. కాగా లాక్‌డౌన్ అమల్లో ఉండగానే.. అంటే మే ఆరంభం నాటికే మన దేశంలో 64 లక్షల మందికి కరోనా సోకిందని అంచనా. ఐసీఎంఆర్ తొలిసారిగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరోసర్వే ప్రకారం మే తొలి నాళ్లకే మన దేశంలో 0.73 శాతం మంది పెద్దవారిలో (అడల్ట్స్)లో కోవిడ్ బారిన పడ్డారు. ఇది 6.4 మిలియన్లకు సమానం. ఈ వివరాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి. మే 11 నుంచి జూన్ 4 వరకు 28 వేల మంది రక్త నమూనాలను సేకరించి కోవిడ్ కవచ్ ఎలిసా కిట్ల సాయంతో ఐజీజీ యంటీ బాడీలను పరీక్షించారు. 18-45 ఏళ్ల మధ్య వయస్కుల్లో సీరోపాజిటివిటీ ఎక్కువగా (43.3 శాతం) ఉన్నట్లు తేలగా.. 46-60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 39.5 శాతంగా ఉందని.. 60 ఏళ్లు దాటిన వారిలో 17.2 శాతంగా ఉందని తేలింది. మే తొలినాళ్ల వరకు మన దేశంలో 64,68,388 మందికి ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని ఈ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది. ఈ సర్వేలో భాగంగా కేసుల సంఖ్య తీవ్రంగా ఉన్న జిల్లాల నుంచి అస్సలు కేసులు లేని జిల్లాల వరకు 70 జిల్లాల్లోని 700 క్లస్టర్లలో 30,283 ఇళ్లకు వెళ్లారు. సర్వే చేసిన క్టస్లర్లలో 25.9 శాతం పట్టణ ప్రాంతాలున్నాయి.


By September 11, 2020 at 12:30PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/64-lakh-covid-19-infections-by-early-may-in-india-national-sero-survey/articleshow/78054238.cms

No comments