Breaking News

ఇంటర్ పాసైతే రూ.25వేలు, డిగ్రీ పూర్తిచేస్తే రూ.50వేలు.. నితీశ్ ఎన్నికల తాయిలాలు


బిహర్ శాసనసభ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగుతున్నాయి. హ్యాట్రిక్‌పై గురిపెట్టిన ముఖ్యమంత్రి తన అమ్ములిపొదిలోని ఓ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. ఇప్పటికే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేసి మహిళల అభిమానం సంపాదించారు. తాజాగా, మహిళల అక్షరాస్యతను ప్రోత్సహించడానికి కొత్త పథకాలను తెరపైకి తెచ్చారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన తాయిలాలు ప్రకటించారు. ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో‌ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ ఉత్తీర్ణులైన అమ్మాయిలకు రూ.50 వేలు అందజేయనున్నట్టు నితీశ్ వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తామని సీఎం నితీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యా సంస్థలు ఆ శాఖ కిందకు వస్తాయని పేర్కొన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించేవారికి ఆర్థిక సహాయం చేస్తామని నితీశ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఏడు పాయింట్ల అజెండాకు కొనసాగింపుగా ‘సాథ్ నిశ్చయ్ పార్ట్-2’ను నితీశ్ ప్రకటించారు. షెడ్యూల్ విడుదలైన కొద్ది సేపటికే మీడియా సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ.. మహిళల అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సొంత అజెండాతో వెళ్తారా? లేక ఎన్డీఏ కూటమి ప్లాన్‌ను అనుసరిస్తారా? అన్న ప్రశ్నకు నితీశ్ బదులిస్తూ.. తాను మరోసారి అధికారంలోకి వస్తే వీటిని తప్పకుండా నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు..నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతకు పెద్దపీట వేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని అన్నారు. గ్రామాల్లో సోలార్ వీధి దీపాలు, చెత్త నిర్వహణ వ్యవస్థలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. పట్టణాలు, నగరాల్లో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని, వృద్ధాశ్రమాలను, పేదలకు నివాసాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. బిహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరగనుండగా… నవంబర్ 3న రెండో విడత… నవంబర్- 7మూడో విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10న ఫలితాలను వెల్లడిస్తారు. బిహార్ ‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈసీ ప్రకటించిన ఎన్నికల తేదీలను అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి.


By September 26, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/grants-for-inter-and-degree-girls-shelters-for-seniors-bihar-cm-unveils-7-point-plan/articleshow/78327615.cms

No comments