నాన్నకు పనస పండంటే ఎంతో ఇష్టం.. స్వగ్రామం నుంచి తీసుకురమ్మన్నారు: ప్రణబ్ కుమారుడు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్కు సోమవారం శస్త్రచికిత్స నిర్వహించగా.. మంగళవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ప్రస్తుతం ఆయన పరిస్థితిలో పెద్దగా పురోగతి కనిపించలేదు. ప్రణబ్ కన్నుమూశారంటూ కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఆయన కుమార్తె, కుమారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక, అనారోగ్యానికి గురికాక ముందు వారం తనను పిలిచి, స్వగ్రామం నుంచి తన కోసం ఓ పనసపండు తీసుకురమ్మని కోరారని ఆయన కుమారుడు తెలిపారు. ‘కోల్కతా నుంచి బిర్బూమ్ జిల్లాలోని మా స్వగ్రామం మిరాటీకి వెళ్లి ఆయన కోసం 25 కిలోల బరువైన ఓ పనస పండు తీసుకొచ్చాను.. ఆగస్టు 3న రైలులో ఢిల్లీకి వచ్చిన నాన్నను కలిశాను.. నాతోపాటు ఆయనకు కూడా రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం’అని అభిజిత్ కన్నీటి పర్యంతమయ్యారు. తాను తీసుకొచ్చిన పనసపండు కొద్దిగా తిన్న తర్వాత ఆయన చక్కగా ఉన్నారు.. చక్కెర స్థాయిలు కూడా పెరగలేదు.. ఎంతో సంతోషంగా ఉన్నారు అని పేర్కొన్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడానికి ముందే తనకు కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాటి నుంచి ఆర్మీ వైద్యులే ప్రణబ్ మెడికల్ రికార్డులను చూస్తున్నారు.. కాబట్టి అస్వస్థతకు గురయిన వెంటనే ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్కు తరలించాం.. పీపీఈ కిట్ ధరించి, భద్రత చర్యలు తీసుకుని ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఆయనను చూశాను.. ఊపిరి తీసుకోవడంలోనూ ఎటువంటి ఇబ్బంది పడటంలేదు’ అని అభిజిత్ ముఖర్జీ వివరించారు.
By August 14, 2020 at 11:13AM
No comments