Breaking News

పదేళ్లలోపు పిల్లలు గంట కంటే ఎక్కువ సేపు ఆన్‌లైన్ క్లాసులు వింటే అనర్ధం.. నిపుణుల హెచ్చరిక


కనీసం ఎనిదేళ్లు దాటిన చిన్నారులకే మొబైల్ ఫోన్‌లను ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండేల్లు కూడా నిండని పిల్లలకు కూడా మొబైల్స్ ఇచ్చి వారిని ఫోన్ వ్యసనపరులుగా చేస్తున్నారని, దీని ద్వారా వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ‘సాంకేతికతకు నేటి తరం పిల్లలు వ్యసనపరులవుతున్నారా’ అనే అంశంపై బుధవారం సాయంత్రం రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు . సింబయాసిస్ లా స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో సైనిక దళాల మీడియా శిక్షకురాలు జూహీ కౌల్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. కోవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ తదనంతర పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఆన్‌లైన్ తరగతులు అనివార్యమయ్యాయని అన్నారు. అయితే, కనీసం ఎనిమిదేళ్లు దాటిన పిల్లలకు మాత్రమే ఈ క్లాసులు వర్తింపజేయాలని ఆమె సూచించారు. పదేళ్లలోపు పిల్లలకు రోజూ కనీసం ఒక గంట కంటే ఎక్కువ సేపు ఈ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించరాదని అన్నారు. ఈ వయస్సులో పిల్లలకు వివిధ అంశాలపై సహజంగా ఉండే ఆసక్తి, నిశిత పరిశీలన, ఇమాజినేషన్‌లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి ఎక్కువ సమయం ప్రధానంగా అర్దరాత్రి వరకూ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని ఆమె వివరించారు. పిల్లలు, యువత రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయేవిధంగా తల్లిదండ్రులు తగు చర్యలు చేపట్టాల్సి ఆవశ్యకత ఉందని తెలిపారు. ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్‌టాప్‌ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని జూహీ కౌల్ సూచించారు. సోషల్ మీడియాపై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తేవద్దని జూహీ కౌల్ హెచ్చరించారు. టాబ్, మొబైల్, లాప్‌టాప్‌లలో అనవసరమైన, ఎప్పుడూ ఉపయోగించని యాప్‌లను తొలిగించాలన్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందని ఆమె తెలిపారు. అనవసర యాప్‌లను తొలగించడంతో పాటు కేవలం విద్యాపరమైన అవసరాలకే ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పడం చేయాలని అన్నారు. రోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి అలవాటు చేయించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఐడీ విభాగానికి చెందిన రవి కుమార్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలి, నీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తో పాటు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


By July 30, 2020 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telangana-women-police-wing-hold-seminor-on-effects-of-mobile-phones-on-childrens-health/articleshow/77253900.cms

No comments