Breaking News

కేరళ: మరో మలుపు తిరిగిన బంగారం అక్రమ రవాణ కేసు.. రంగంలోకి ఎన్ఐఏ


కేరళలో రాజకీయ దుమారం రేపుతోన్న బంగారం అక్రమ రవాణా కేసు.. గురువారం మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని గత శనివారం తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. డిప్లమాటిక్ కార్గో ద్వారా యూఏఈ కాన్సులేట్ చిరునామాతో ఈ బంగారం రావడంతో వ్యవస్థీకృత స్మగ్లింగ్ వ్యవహారం జాతీయ భద్రతకు తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ హోం శాఖ పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చట్టవిరుద్దమైన కార్యకలాపాల నిషేధిత చట్టం 2004లోని ఉగ్రవాద చట్టం, ఉగ్రవాదులకు నిధులకు సంబంధించిన సెక్షన్ 15,16,17,18 కింద ఎన్‌ఐఏ కేసు నమోదుచేసినట్టు తెలుస్తోంది. ‘ఈ వ్యవహారంలో అంతర్జాతీయ ముఠాలకు సంబంధం ఉందా? దీని వల్ల జాతీయ భద్రత, ఆర్ధిక అంశాలను ప్రభావితం చేసిందా అనే దిశగా ఎన్ఐఏ దర్యాప్తు సాగనుంది’ అని ఓ అధికారి తెలిపారు. ఈ వ్యవహారంపై సరైన విధానంలోనే దర్యాప్తు ప్రారంభిస్తామని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. బంగారం అక్రమ రవాణా కేసులో యూఏఈ కాన్సులెట్ మాజీ ఉద్యోగి స్వప్నా సురేశ్ ప్రమేయం ఉండటంతో కేరళలో ఒక సంచలనం సృష్టించింది. ఆమె అక్కడ పనిచేసిన సమయంలో తరచుగా సామాజిక, రాజకీయ, అధికార వర్గాలను కలిసేది. వాస్తవానికి, కేరళ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శికి ఎం శివశంకర్‌కు ఆమెతో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో ఆయనను మంగళవారం ఆ పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న స్వప్నా సురేశ్ ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. యుఎఈ కాన్సులేట్-జనరల్ ఆఫీసులోని సీనియర్ దౌత్యవేత్త రషీద్ ఖామిస్ అల్ షమెలీ ఆదేశాలతోనే పార్శిల్‌కు సంబంధించి విమానాశ్రయ అధికారిని సంప్రదించినట్లు తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొంది. ‘వర్క్ ఆన్ రిక్వెస్ట్’ ప్రాతిపదికన కాన్సులేట్‌‌తో కలిసి పనిచేస్తున్నానని తెలిపింది. రూ.15 కోట్ల విలువైన ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకోడానికి ముందు డిప్లమాటిక్ కార్గోలో దాచి పెట్టారు. దీనిని సాధారణంగా కస్టమ్స్ అధికారులు పరీక్షించరు. అందులో బాత్రూమ్ సామాన్లు, నూడుల్స్, బిస్కెట్లు, ఖర్జూరాలుగా పేర్కొన్నారు. అయితే, అందులో బంగారం ఉన్నట్టు కస్టమ్స్ అధికారులు సమాచారం అందింది. దీంతో వ్యవహారం బయటపడింది.


By July 10, 2020 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/diplomat-involved-in-kerala-gold-smuggling-says-accused-nia-gets-case/articleshow/76885629.cms

No comments