Breaking News

బీహార్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం


బీహార్‌లో భద్రత బలగాలకు, మావోయిస్టలకు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు హతమయ్యారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహా ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్‌బీ), బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు. ఘటానా స్థలంలో నక్సలైట్ల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకా నక్సల్స్ కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఎస్ఎస్‌బీ, ఎస్టీఎఫ్ దళాలు అక్కడకు చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో నక్సల్స్ కాల్పులకు పాల్పడటంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఐదు రోజుల కిందట ఒడిశాలోని మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సిర్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డిస్ట్రిక్ట్ వలంటీరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా తుమిడిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్లా గ్రామ సమీపంలో అడవుల్లో కూబింగ్ నిర్వహించింది.


By July 10, 2020 at 09:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-naxals-have-been-killed-in-an-encounter-at-pashchim-champaran-in-bihar/articleshow/76885873.cms

No comments