Breaking News

మధ్యప్రదేశ్‌లో క్యాబినెట్ విస్తరణ.. సింధియా వర్గానికే పెద్ద పీట


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని గురువారం విస్తరించారు. మరో 28 మందిని క్యాబినెట్‌లోకి తీసుకోగా.. వీరిలో జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 12 మందికి మంత్రి పదవులు దక్కాయి. దీంతో ముఖ్యమంత్రితో కలిసి మధ్యప్రదేశ్ క్యాబినెట్‌ మంత్రుల సంఖ్య 34కి చేరింది. 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. బీఎస్పీ, ఎస్పీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఆడిన రాజకీయ చదరంగంలో కమల్‌నాథ్ సర్కార్ చిత్తయ్యింది. కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచీ అంతర్గతంగా సవాల్‌ను ఎదుర్కొంటూ 15 నెలల తర్వాత చివరకు కూలిపోయింది. కమల్‌నాథ్, యువనేత జ్యోతిరాదిత్య సింధియా మధ్య కొనసాగిన ప్రచ్ఛన్న యుద్దం.. రాజ్యసభ ఎన్నికల పుణ్యమా అని ముదిరి పాకానపడింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సింధియాకు మద్దతుగా దాదాపు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, బీజేపీకి మద్దతు తెలిపారు. సింధియా తన వర్గాన్ని తీసుకుని బయటకు వెళ్లిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోగా.. కమల్ నాథ్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. మార్చి 23న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 2005, 2008, 2013లో ముఖ్యమంత్రిగా పని చేశారు. మూడు నెలల అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన అనుచరులకే పదవులు లభించాయి. గురువారం నాటి క్యాబినెట్ విస్తరణలో 28 మంది, మూడు నెలల కిందట చౌహన్‌తో కలిసి ఆరుగురు మంత్రులు ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ నేత కైలాష్ విజయ వర్గియా వర్గానికి చెందిన ఎవరూ మంత్రివర్గంలో చేరలేదు. అలాగే, మాజీ సీఎం ఉమా భారతికి వర్గానికి మొండిచేయి దక్కింది.


By July 03, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-scindias-12-in-shivrajs-expanded-cabinet-of-28/articleshow/76762570.cms

No comments