Breaking News

రాజస్థాన్‌ హైడ్రామా: రాజ్‌భవన్ ఎదుట ఎమ్మెల్యేల ధర్నా.. అర్ధరాత్రి క్యాబినెట్ భేటీ


రాజస్థాన్‌‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. క్యాబినెట్ సిఫార్సు చేసినా అసెంబ్లీని సమావేశపరిచేందుకు ఆదేశాలివ్వటంలో గవర్నర్‌ జాప్యం చేస్తున్నారని సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్గం ఆందోళనకు దిగింది. శుక్రవారం దాదాపు 103 మంది ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌ ఆవరణలో ఐదు గంటల పాటు ధర్నాకు దిగి.. చివరికి అసెంబ్లీ సమావేశంపై గవర్నర్‌ నుంచి హామీ లభించడంతో విరమించారు. అసెంబ్లీ సమావేశ తేదీని ప్రకటించే వరకూ రాజ్‌భవన్‌ ప్రాంగణంలోనే ఉండి ధర్నా కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. 103 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారని రాష్ట్ర సాంకేతిక విద్య మంత్రి సుభాష్‌ గార్గ్‌ తెలిపారు. గవర్నర్‌ అసెంబ్లీని సమావేశపరిచేందుకు అంగీకరించటంతో వారు ధర్నాను విరమించి హోటల్‌కు తిరిగి వెళ్లారు. అసెంబ్లీని సమావేశపరచడంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 173లో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడి ఉంటానని గవర్నర్‌ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశ అజెండా ఏమిటని ఈ సందర్భంగా గవర్నర్‌ కల్‌రాజ్‌ ప్రశ్నించారు. ఆరు అంశాల్లో వివరణ లభించిన తర్వాత అసెంబ్లీ సమావేశంపై ఉత్తర్వులు వెలువరిస్తామని గవర్నర్‌ చెప్పినట్టు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుర్జేవాలా వెల్లడించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అత్యవసరంగా తన నివాసంలో సీఎం క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేసి, అసెంబ్లీని సమావేశపరిచాలని తీర్మానం చేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో గవర్నర్ లేవనెత్తిన ఆరు అంశాల గురించి చర్చించారు. ఈ అంశాలపై చర్చించి, చేసిన తీర్మానాన్ని శనివారం గవర్నర్‌కు పంపనున్నారు. కరోనా వైరస్, ఆర్ధిక సంక్షోభం అంశాలే ప్రధాన అజెండాగా క్యాబినెట్ తీర్మానించినట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అసెంబ్లీని సమావేశపరచడానికి 21 రోజుల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. క్యాబినెట్ పంపిన నోట్‌లో అసెంబ్లీ సమావేశపరచాల్సిన తేదీని వెల్లడించలేదని, దీనికి ఆమోదం కూడా తెలపలేదని అన్నారు. అంతేకాదు, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తిరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.


By July 25, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-political-crisis-at-late-night-meet-gehlot-cabinet-discusses-governors-6-points/articleshow/77162925.cms

No comments