Breaking News

రాామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న శంకుస్థాపన.. ప్రధాని చేతుల మీదుగా?


అయోధ్యలోని రామమందిర నిర్మాణం ప్రారంభానికి దాదాపు ముహూర్తం ఖరారయ్యింది. శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సమావేశమై శంకుస్థాపనకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆగస్టు 5న శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన ట్రస్ట్.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పీఓంకి పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ తేదీకి ప్రధాని కూడా సమ్మతించినట్టు ట్రస్ట్‌ సభ్యుల్లో ఒకరైన కామేశ్వర్ చౌపాల్ వ్యాఖ్యానించారు. ప్రధానఆలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైనందున పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారని ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. ముందుగా గర్భగుడికి జరిగే భూమి పూజతో మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం నాటి ట్రస్ట్ సమావేశంలో గ్రహాల స్థితిగతులను బట్టి ఆగస్టు 3 లేదా 5న మంచి ముహూర్తం ఉన్నట్టు పండితులు వివరించారు. అయితే, ఆగస్టు 5 ముహూర్తానికి కమిటీ సభ్యులు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కీలకమైన ఈ సమావేశానికి ప్రధాని మాజీ సెక్రెటరీ, ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర శర్మ హాజరయ్యారు. ఆలయ శంకుస్థాపన ముహూర్తంపై ప్రధానమంత్రి కార్యాలయం తుది నిర్ణయం తీసుకుంటుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటయిన తర్వాత అత్యున్నత స్థాయిలో జరిగిన తొలి సమావేశం ఇదే. ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయాన్ని ధ్రువీకరించిన రాయ్.. హిందువుల విశ్వాసానికి ప్రతీక అయిన ఈ ప్రాజెక్టుకు వర్షాకాలం ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాల నుంచి నిధులు సమీకరణ ప్రారంభించనున్నట్లు రాయ్ చెప్పారు. ట్రస్ట్ ఛైర్మన్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ మాట్లాడుతూ.. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైతే దేశంలోని హిందువులకు గొప్ప సందేశం వెళుతుందని అన్నారు. మూడు లేదా మూడున్నరేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వాస్తవానికి రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిచాలని రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ భావించింది. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులను ఆహ్వానించి అత్యంత వైభవంగా శంకుస్థాపన జరపాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా కొద్ది మంది ప్రముఖులతో నిర్వహించాలని తాజాగా ట్రస్ట్‌ నిర్ణయించింది. దీంతో రామ మందిర నిర్మాణ పనుల శంకుస్థాపనకి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు, యూపీకి చెందిన ఎంపీలను మాత్రమే ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి.


By July 19, 2020 at 07:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sri-ram-temple-foundation-in-ayodhya-may-be-laid-on-august-5/articleshow/77045546.cms

No comments